
- తెలంగాణ సహా గోదావరి పరివాహక స్టేట్స్కు పంపిన కేంద్రం
- పీపీఏ, కృష్ణా, గోదావరి బోర్డులకూ అందజేత
హైదరాబాద్, వెలుగు: గోదావరి బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్ట్పై ఏపీ సిద్ధం చేసిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)ను కేంద్రం.. సంబంధిత రాష్ట్రాలకు పంపింది. పీఎఫ్ఆర్ను ఇటీవల ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖలకు అందించింది. తాజాగా ఆ రిపోర్టును గోదావరి పరివాహక, దాని ప్రభావిత రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్కు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) పంపించింది.
ఆయా రాష్ట్రాలతో పాటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)ల చైర్మన్లకూ పంపించింది. వాటితో పాటు పోలవరం ప్రాజెక్ట్ డైమెన్షన్లలోనూ పలు మార్పులు జరిగిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)కీ పీఎఫ్ఆర్ను పంపించింది. ఈ నేపథ్యంలోనే జీబీ లింక్ ప్రాజెక్ట్ పీఎఫ్ఆర్పై ఏవైనా అభ్యంతరాలు, అభిప్రాయాలుంటే చెప్పాలని రాష్ట్రాలు, బోర్డులు, పీపీఏని లేఖలో సెంట్రల్ వాటర్ కమిషన్ కోరింది.
కాగా, జీబీ లింక్ ప్రాజెక్టును ఆపాలంటూ ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖలకు జనవరి 22న లేఖలు రాశారు. దానికి బదులుగా గత నెల 28న.. ఇంకా రిపోర్టు అందలేదని, అందాక చర్యలు తీసుకుంటామని ఉత్తమ్కు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పీఎఫ్ఆర్ను కేంద్రం సంబంధిత రాష్ట్రాలు, విభాగాలకు పంపించింది.
ఈ నెల 25న ప్రగతి మీటింగ్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ముంపు సమస్య, భూసేకరణ తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రగతి మీటింగ్ను నిర్వహించనున్నారు. ఈ నెల 25న సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి గత నెల 28న నిర్వహించిన ప్రగతి సమావేశంలో పోలవరమే ప్రధాన ఎజెండాగా ఉన్నప్పటికీ.. పలు కారణాలతో ఎజెండా నుంచి దాన్ని తొలగించారు.
తాజాగా పోలవరంపై ప్రగతి మీటింగ్ను 25న నిర్వహించబోతున్నట్టు తెలంగాణ సహా గోదావరి పరివాహక రాష్ట్రాలకు కేంద్రం సమాచారం పంపింది. పోలవరం ప్రాజెక్టు ముంపు, భూసేకరణ, రిహాబిలిటేషన్, ప్రజాభిప్రాయసేకరణ, ఇతరత్ర సాంకేతిక అంశాలపై తెలంగాణ సహా, ఒడిశా, చత్తీస్గఢ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.