- ఎఫ్ఐఆర్, చార్జిషీట్, రిలీఫ్ ఇష్యూస్పై ఫిర్యాదుకు వెబ్సైట్
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్రం స్పెషల్ సెల్ను ఏర్పాటు చేసింది. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఈ సెల్కు నేషనల్ హెల్ప్ డెస్క్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అని పేరు పెట్టింది. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, చార్జిషీట్ దాఖలు, బాధితులకు పరిహారం చెల్లింపుల్లో రాష్ట్రాలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో బాధితులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సరైన పరిష్కారం తీసుకురావాలని భావించిన కేంద్రం స్పెషల్ సెల్ను ఏర్పాటు చేసింది.
ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే..
https://nhapoa.gov.in అనే వెబ్సైట్లో బాధితులు సమస్యను రిజిస్టర్ చేయొచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్టర్ యువర్ గ్రీవెన్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. అందులో గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్, ఇన్ఫార్మర్ వివరాలు, విక్టిమ్ వివరాలు, విక్టిమ్ ఐడెంటిఫికేషన్, అడ్రస్, మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ను నింపాలి. ఎఫ్ఐఆర్, చార్జిషీట్, రిలీఫ్పై ఫిర్యాదు చేయొచ్చు. ఇది నేరుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్కు చేరుతుంది. అక్కడ అధికారులు సమీక్షించి, రాష్ట్రం దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
తెలంగాణలో ఏవీ సక్కగ అమలైతలే..
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద దళిత, గిరిజనులకు ఇచ్చే రిలీఫ్ను 3 నెలలుగా బంద్ చేశారు. ప్రొసీడింగ్స్ పూర్తయినా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చెక్కులు మంజూరు కావడంలేదు.యాక్ట్ ప్రకారం.. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాగానే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కింద మైనర్ అయితే 25%, మేజర్ అయితే 50% రిలీఫ్ను వారం రోజుల్లోగా అందజేస్తారు. మిగతా అమౌంట్ను చార్జిషీట్ ఫైల్ అయిన తర్వాత ఇస్తారు. రేప్, మర్డర్ అడిషనల్ రిలీఫ్ కింద 3 నెలలకు సరిపడా రేషన్ను అందించాలి. మూడు నెలల్లోపు అర్హతను బట్టి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు, గ్రామీణ ప్రాంతాలవారైతే మూడెకరాల భూమిని ఇవ్వాలి. చాలా సందర్భాల్లో అట్రాసిటీ కేసులను కనీసం నమోదు కూడా చేయడం లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా ఛార్జిషీట్ దాఖలు చేయడంలేదు. కేసు ఫైల్ అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్(జిల్లాల్లో డీఎస్పీ, సిటీల్లో ఏసీపీ)ను అపాయింట్ చేయాలి. నెలలోపు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, 60 రోజుల్లోపు కోర్టులో చార్జిషీట్ వేయాలి. 60 రోజుల్లోపు కోర్టులో ట్రయల్స్ జరగాలి. అయితే రాష్ట్రంలో ఇవేవీ టైంకు జరగడం లేదు. సమస్యలను పరిష్కరించుకోవడానికి బాధితులకు మంచి ప్లాట్ఫాం దొరికిందని పలువురు చెబుతున్నారు.
సమస్యల పరిష్కారానికి మంచి అవకాశం
ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారం కోసం కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని ప్రత్యేక సెల్ తీసుకురావడం సంతోషం. కేంద్రానికి ప్రభుత్వానికి థ్యాంక్స్. సమస్యలు చెప్పుకోవడానికి బాధితులకు అవకాశం దొరికింది. రాష్ట్రంలో అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఈ సెల్ ద్వారా బాధితులు సమస్యలు పరిష్కరించుకోవాలి.
- బత్తుల రాంప్రసాద్, మాల సంక్షేమ సంఘం, స్టేట్ ప్రెసిడెంట్