బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత హెచ్డీ దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కర్నాటక రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. మహిళలతో అతను అసభ్యగా ప్రవర్తిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హసన్ జిల్లాలో పలువురు మహిళను లైంగికంగా వేధించారంటూ ఆ వీడియోల్లో ఆరోపించారు. వైరల్ అవుతున్న వీడియోలు ప్రజ్వల్ డూప్తో చిత్రీకరించినవి, మార్ఫింగ్ చేసినవని ఆరోపిస్తూ హొలెనరసాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రజ్వల్ తరఫున ఫిర్యాదు దాఖలైంది. తన ప్రతిష్టను దిగజార్చేందుకు మార్ఫింగ్ చేసిన వీడియోలు వైరల్ చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.
కఠిన చర్యలు తీస్కోవాలె..
మహిళలను లైంగికంగా వేధించి, అసభ్యంగా ప్రవర్తించిన ప్రజ్వల్ను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బెంగళూరులో నిరసన చేపట్టారు. ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టారు. అలాగే ఈ స్కాండల్పై విచారణ జరిపించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మి చౌదరి సీఎంకు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బిజయ్ సింగ్ సారథ్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీంతో ప్రజ్వల్ దేశం విడిచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్కు వెళ్లారు.
బీజేపీ సైలెంట్..
జేడీఎస్, బీజేపీ పొత్తుపెట్టుకొని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సెక్స్స్కాండల్పై జేడీఎస్ చీఫ్ కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. మహిళలంటే తమ కుటుంబానికి ఎంతో గౌరవం ఉందని.. ఇబ్బందులకు గురయ్యామని మహిళలు ఎవరూ తమ దృష్టికి తీసుకురాలేదన్నారు. అలా ఎవరైనా వస్తే వారికి న్యాయం చేస్తామని చెప్పారు. మరోవైపు ఈ వివాదంపై బీజేపీ సైలెంట్గా ఉంది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ ముఖ్య అధికార ప్రతినిధి ఎస్ ప్రకాశ్ మాట్లాడుతూ.. “పార్టీగా మాకు, ప్రజ్వల్ వీడియోలతో ఎటువంటి సంబంధం లేదు, సెక్స్ స్కాండల్పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎంక్వైరీపై మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు” అని పేర్కొన్నారు.