ఎన్నికల్లో మా మద్దతు కాంగ్రెస్కే: మాదిగ ఉపకులాల ఫ్రంట్

ఎన్నికల్లో మా మద్దతు కాంగ్రెస్కే: మాదిగ ఉపకులాల ఫ్రంట్

ఖైరతాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీకి అండగా ఉంటామని మాదిగ ఉప కులాల ఫ్రంట్ నాయకులు ప్రకటించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో తెలంగాణ మాదిగ రిజర్వేషన్ సమితి అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ ఆధ్వర్యంలో  నిర్వహించిన సమావేశంలో పలు సంఘాల నేతలు పాల్గొని కాంగ్రెస్​కు మద్దతు తెలిపారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్​అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఇటుక రాజు మాట్లాడుతూ..మాదిగ సామాజిక వర్గాన్ని మందకృష్ణ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కిషన్​రెడ్డితో కలిసి  బీజేపీని గెలిపించాలని చూస్తున్నారని, మానవ హక్కులను కాలరాస్తున్న బీజేపీకి మందకృష్ణ ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. సికింద్రాబాద్​స్థానంలో కిషన్ రెడ్డికి డిపాజిట్లు దక్కకుండా చేయాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు.

సమావేశంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు జన్ను కనకరాజు మాదిగ, ఎస్సీ 57 ఉపకులాల ఐక్యవేదిక అధ్యక్షుడు చింతల రాజలింగం, మోచి సంఘం అధ్యక్షుడు దశరథ్, శంకర్, వరప్రాద్ తదితరులు పాల్గొన్నారు.