న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, ఇ -కామర్స్ విభాగాల్లో సేవలందిస్తున్న గిగ్ వర్కర్లు డిసెంబర్ 31న దేశవ్యాప్త సమ్మెను చేపట్టనున్నారు. వేతనాలు, అధిక పని గంటలు, ఉద్యోగ, సామాజిక భద్రత వంటి డిమాండ్లతో ఆందోళన చేపట్టనున్నారు. రెండ్రోజుల పాటు నిర్వహించనున్న సమ్మెలో భాగంగా గురువారం కూడా నిరసనలు చేపట్టారు.
తెలంగాణ గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ) ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థల సేవలపై ప్రభావం పడింది. గిగ్ వర్కర్ల పరిస్థితి దారుణంగా తయారవుతున్నదని టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపకుడు షేక్ సలావుద్దీన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్లాట్ ఫామ్ లను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
