- ఇండియాలో జాబ్లాస్ తక్కువే..
- మన దగ్గర వైట్కాలర్ వర్కర్ల సంఖ్య తక్కువ: కేంద్ర ఐటీ సెక్రెటరీ కృష్ణన్
న్యూఢిల్లీ: ధనిక/పశ్చిమ దేశాలతో పోలిస్తే ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వలన తక్కువగా జాబ్స్ పోతాయని ఐటీ సెక్రెటరీ ఎస్ కృష్ణన్ అభిప్రాయపడ్డారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు వంటి వైట్ కాలర్ జాబ్స్పై ఏఐ ప్రభావం తక్కువగా ఉంటుందని, ఇతర జాబ్స్తో పోలిస్తే వైట్ కాలర్ ఉద్యోగాలు ఇండియాలో తక్కువ శాతం ఉన్నాయని అన్నారు. అలానే మన వైట్ కాలర్ జాబ్స్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) సెగ్మెంట్లో ఎక్కువని, కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ‘‘ రంగాల వారీగా, వినియోగానికి అనుగుణంగా యాప్లను డెవలప్ చేసి, అమల్లోకి తేవడంలో ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కూడా పెద్ద సంఖ్యలో శిక్షణ పొందిన నిపుణులు అవసరం అవుతారు. ఇండియా బలం ఈ సెగ్మెంట్లో ఉంది” అని ఆయన పేర్కొన్నారు. ఏఐ మొదటిసారి నాలెడ్జ్ వర్కర్లకు సవాలు విసురుతుందని, కానీ ఇది పూర్తిగా ఉద్యోగాలను తొలగించదని అన్నారు. మానవ సామర్ధ్యం ఏఐతో పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏఐ ఔట్పుట్స్ను చెక్ చేయడానికి మనుషుల అవసరం చాలా కాలం వరకు ఉంటుందని అన్నారు. ఏఐ మోడల్స్ నిర్మాణానికి బాగా స్కిల్స్ ఉన్న టీమ్ అవసరమవుతుందని కృష్ణన్ తెలిపారు. భారత్ ఏఐని స్వదేశీ మోడల్తో ప్రపంచానికి అందించగలదని అన్నారు.
