
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్ ఆరంభమయ్యే క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. లైసెన్స్ పొందిన విత్తన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనాలని రైతులకు సూచించింది. విత్తనాలు కొన్న తర్వాత తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, ఆ రసీదును పంట కోతలు పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని పేర్కొంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే కార్యక్రమంలో భాగంగా పోలీసు, విజిలెన్స్ శాఖలను అప్రమత్తం చేసింది.
ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి విత్తనాలు సరఫరా కాకుండా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. లైసెన్స్ లేకుండా నిషేధిత పత్తి, ఇతర విత్తనాలను రైతులకు అమ్మేవారిపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు జిల్లాలో పొలీసు, విజిలెన్సు వ్యవసాయ శాఖ కలిసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. అక్రమ రవాణాకు పాల్పడిన, అనుమతులు లేని విత్తనాలను అమ్మిన 12 మందిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేశారు.