లద్ధాఖ్లో కీలక టన్నెల్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం

లద్ధాఖ్లో కీలక టన్నెల్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం

దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కేంద్రం..మరో కీలక నిర్ణయం తీసుకుంది. లద్దాఖ్లోని సరిహద్దు ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి షింకున్ లా సొరంగాన్ని నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. లద్ధాఖ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య 4.1 కిలో మీటర్ల పొడవైన సొరంగ మార్గం నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. నిమూ- పదామ్-దార్చా రోడ్డు లింక్ లో రూ. 1,681 కోట్ల వ్యయంతో ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయనుంది.  అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో లద్ధాఖ్ కు సులువుగా చేరుకోవడానికి ఈ టన్నెల్ ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.  2025 డిసెంబరునాటికి పూర్తవుతుందని చెప్పారు.

లద్ధాఖ్లోని షింకున్ లా సొరంగ మార్గం ప్రణాళికను 2021 మేలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ముందుగా చిన్న సొరంగాన్ని  ప్రతిపాదించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్..ఆ తర్వాత 12.7 కిలో మీటర్ల టన్నెల్ కనెక్టివిటీని ప్రతిపాదించింది. చివరకు 4.1 కిలో మీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు కేంద్ర అనుమతి ఇచ్చింది. అయితే చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో లద్ధాఖ్ కు ఏ స్థితిలో అయినా చేరుకోవడానికి ఈ చిన్న సొరంగం ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కేంద్రం ఆమోదం తెలిపింది. 

లద్ధాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి అనేక రహదారుల ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. 2026 నాటికి మనాలి యాక్సిస్‌ నుంచి నేరుగా 298-కిమీ NHDL స్పెసిఫికేషన్ రోడ్డు ద్వారా పశ్చిమ లడఖ్, జంస్కార్ వ్యాలీకి ఆల్టర్నేటివ్‌ కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఈ  రోడ్డులోనే 4.1-కిమీ ట్విన్ ట్యూబ్ షింకున్ లా టన్నెల్ ఉండటం విశేషం. ఈ రోడ్డు పనులు  దాదాపు 65 శాతం పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా కీలకమైన దర్బుక్ -ష్యోక్-దౌలత్ బేగ్ ఓల్డి రహదారిపై, కీలకమైన అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్, LAC సమీపంలో పోస్ట్‌కు కనెక్టివిటీని అందిస్తోంది. 35 బ్రిడ్జిలు,  "క్లాస్-70" స్పెసిఫికేషన్‌లకు అప్‌గ్రేడ్ చేస్తున్నారు. 

సరిహద్దుల్లోకి ప్రస్తుతం తొమ్మిది కొత్త టన్నెల్స్‌ నిర్మాణంలో ఉన్నాయి. అరుణాచల్‌లోని తవాంగ్‌కు వ్యూహాత్మక 2.5-కిమీ సెలా టన్నెల్‌ను రూ.687 కోట్లతో 13,000 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. మరో 11 టన్నెల్స్‌ ప్రణాళికలో ఉన్నాయని కేంద్రం పేర్కొంది.