గిరిజనులకు లక్ష ఇండ్లు .. త్వరలో రాష్ట్రానికి మంజూరు చేయనున్న కేంద్రం

గిరిజనులకు లక్ష ఇండ్లు .. త్వరలో రాష్ట్రానికి మంజూరు చేయనున్న కేంద్రం
  • డీఏజేజీయూఏ స్కీమ్‌‌‌‌ కింద హౌసింగ్ డిపార్ట్‌‌‌‌మెంట్ ప్రపోజల్స్ 
  • ఒక్కో ఇంటికి రూ.72 వేలు ఇవ్వనున్న కేంద్రం 
  • రాష్ట్రంలో  2.75 లక్షల మంది గిరిజనులకు సొంత జాగా ఉన్నట్టు గుర్తింపు  

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం మరో లక్ష ఇండ్లు ఇవ్వనుంది.ఈ ఇండ్లను దర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ( డీఏజేజీయూఏ) స్కీమ్ కింద కేంద్ర గిరిజన శాఖ త్వరలో మంజూరు చేయనుంది. ఇటీవల హైదరాబాద్‌‌‌‌లో ట్రైబల్ స్కీమ్‌‌‌‌ల అమలుపై ఐదు రాష్ర్టాల అధికారులతో కేంద్ర గిరిజన శాఖ అధికారులు వర్క్‌‌‌‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండ్ల కోసం ప్రతిపాదనలు పంపాలని రాష్ర్ట అధికారులకు సూచించారు. ఈ మేరకు హౌసింగ్ డిపార్ట్‌‌‌‌మెంట్ అధికారులు లక్ష ఇండ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభించి జాగా ఉన్నోళ్లకు ఇండ్లు కట్టిస్తున్నది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నది. ఇప్పుడు కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి రూ. 72 వేలు అందనుండగా, మిగతా రూ. 4 లక్షల 28 వేలు రాష్ర్ట ప్రభుత్వం భరించనుంది. కాగా, రాష్ట్రంలో మొత్తం 11 గిరిజన జాతులు ఉండగా.. వారిలో 2.75 లక్షల మందికి సొంత జాగా ఉన్నట్టు సర్వేలో తేలిందని అధికారులు తెలిపారు. ఇప్పుడు లక్ష మందికి ఇండ్లు ఇస్తుండగా, వచ్చే ఏడాది మిగతా వాళ్ల కోసం ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వం తొలి దశలో సొంత జాగా ఉన్న వారికే ఇండ్లు ఇస్తునందున, గిరిజనుల్లో కూడా సొంత జాగా ఉన్నోళ్లనే హౌసింగ్ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. 

పీవీటీజీలకు ఇటీవల మంజూరు..  

రాష్ర్టంలో అత్యంత వెనుకబడిన గిరిజనులు అయిన పీవీటీజీ(పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్)లకు ఇటీవల 22,016 ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ర్టంలో ఉట్నూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, మున్ననూరు ఐటీడీఏలు ఉండగా.. వీటి పరిధిలో 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 13,266 మంది పీవీటీజీలు ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, ఇప్పుడు వాటికి అదనంగా పీవీటీజీఎస్‌‌‌‌లకు మరికొన్ని ఇండ్లు మంజూరు చేసింది. 

ఒక్క ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోనే 10,836 పీవీటీజీలు ఉన్నట్టు అధికారులు తేల్చారు. రాష్ర్ట ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ఇండ్లకు కేంద్రం నుంచి అధిక సాయం అందనుంది. సాధారణంగా పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇచ్చే ఇండ్లకు  రూరల్‌‌‌‌లో రూ.72 వేలు, అర్బన్‌‌‌‌లో రూ.1.50 లక్షలు ఇస్తుండగా.. పీఎం జన్మన్ స్కీమ్ కింద పీవీటీజీలకు ఇచ్చే ఇండ్లకు మాత్రం కేంద్రం నుంచి రూ.1.20 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందనుంది. కాగా, ఐటీడీఏలు, ఏజెన్సీ ఏరియాల్లో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలు బాధ్యతలను ఐటీడీఏ పీవోలకు ప్రభుత్వం అప్పగించింది.