హైదరాబాద్: రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం సోమవారం సాయంత్రం గాంధీ హాస్పిటల్ను సందర్శించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, ఇతర విభాగాల వైద్యాధికారులతో సమావేశమైంది.
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో… వైద్యసేవలు, వసతులు, అందుబాటులో ఉన్న శానిటేషన్ సిబ్బంది, పారామెడికల్, సిబ్బంది, సెక్యూరిటీ, వార్డు బాయ్స్ పనితీరు, పి పి ఈ లు, మెడిసిన్స్ లభ్యత గురించి డాక్టర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాంధీ హాస్పిటల్ లో వున్న బెడ్స్, ఐ సి యు బెడ్స్, వెంటిలేటర్లు తదితర అంశాలను వాకబు చేశారు. వైద్యులు, ఇతర సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ… చికిత్స పొందుతున్న కేసులలో 90% మంది ఆరోగ్య స్థితి నార్మల్ గానే ఉన్నట్లు వివరించారు. సిబ్బంది కొరత లేదని తెలిపారు.
అనంతరం గాంధీ హాస్పిటల్లో ఏర్పాటుచేసిన కోవిడ్-19 ప్రత్యేక వార్డును తనిఖీ చేశారు కేంద్ర అధికారుల బృందం . వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రశంసించింది. ఇక్కడ అందిస్తున్న సేవలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తాయని అభిప్రాయపడింది.