కేంద్ర పథకాల అమలు ఎట్లుంది?..ములుగు జిల్లాలో సెంట్రల్ టీమ్ రెండు రోజుల పర్యటన 

కేంద్ర పథకాల అమలు ఎట్లుంది?..ములుగు జిల్లాలో సెంట్రల్ టీమ్ రెండు రోజుల పర్యటన 
  • పథకాలు అమలయ్యే తీరుపై కలెక్టరేట్ అధికారులతో సమీక్ష

ములుగు, వెంకటాపూర్/రామప్ప,వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు ములుగు జిల్లాలో పర్యటించారు. సెంట్రల్ ఐఅండ్ బీ డిపార్ట్ మెంట్ జాయింట్ సెక్రటరీ ప్రిథుల్ కుమార్​ఆధ్వర్యంలో  టీమ్ రెండు రోజుల క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా  రాగా.. బుధవారం ములుగు కలెక్టర్​దివాకర టీఎస్​స్వాగతం పలికారు. అనంతరం తన చాంబర్ లో వివిధ శాఖల అధికారులతో  కేంద్ర పథకాల అమలుపై సమీక్షించారు.

 ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌‌వై), జల్ జీవన్ మిషన్ (జేజేఎం) వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో అమలయ్యే తీరుపై కలెక్టర్ ​వివరించారు.  పాలెం వాగు ప్రాజెక్ట్, గ్రామీణ నీటి సరఫరా శాఖ పరిధిలోని ఐఈసీ కార్యాచరణ, వ్యక్తిగత, కమ్యూనిటీ మరుగుదొడ్లు, విభజన షెడ్లు, స్వచ్ఛ భారత్ మిషన్, ఆయిల్ పామ్ సాగు, మిరప ప్రాసెసింగ్ యూనిట్ల వివరాలపై తెలిపారు.

అనంతరం ప్రిథుల్ కుమార్‌‌ టీమ్  వెంకటాపూర్​మండలం పాలంపేటకు వెళ్లి రామప్ప చెరువు ఇంటెక్ వెల్‌‌, వాటర్ గ్రిడ్  ప్రాంతాలను పరిశీలించింది.  నీటి శుద్ధి ప్రక్రియపై అధికారులతో చర్చించి, వాటి పనితీరును అడిగి తెలుసుకుంది. అదేవిధంగా ఆయిల్ పామ్ తోటలను సందర్శించి పంట దిగుబడి, నీటి వాడకం, రైతులకు వచ్చే ఆదాయంపై సమగ్ర సమాచారం తీసుకుంది. అనంతరం రామప్ప టెంపుల్ ను దర్శించుకుంది.

రామప్ప సరస్సు ఇంటెక్ వెల్ ద్వారా 175 హ్యాబిటేషన్లకు తాగునీరు సరఫరా, నీటిశుద్ధి విధానం ఉత్తమంగా ఉందని  పేర్కొంటూ అధికారుల కృషిని జాయింట్ సెక్రటరీ టీమ్ ప్రశంసించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ చరణ్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ శాస్త్రవేత్త పి.కిరణ్ కుమార్, ఆర్‌‌డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లేశం, ఈఈ మాణిక్యరావు, డీఈఈ చెరుకు సతీష్, డీపీవో దేవరాజ్, హార్టికల్చర్ ఆఫీసర్  సంజీవ్ రావు, వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు తదితరులు ఉన్నారు.