
గత కొన్ని రోజులు సంచలనంగా మారిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ విషయంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. PFI ని నిషేధించడానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. అనుబంధ సంస్థలపై సైతం నిషేధం ప్రకటించింది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలైన CFI, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్, రిహాబ్ఇండియా ఫౌండేషన్, నేషనల్ ఉమెన్ ఫ్రంట్ సంస్థలను కూడా చట్ట విరుద్ధమైన సంస్థలుగా ప్రకటించింది.
క్రిమినల్, టెర్రర్ చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నందున UAPA కింద విచారణ కేంద్రహోంశాఖ గెజిట్ విడుదల చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున నిషేధం ప్రకటించింది. కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాలలో పలు హత్యలకు పాల్పడడం, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఐసిస్, సిమి లాంటి సంస్థలతో సంబంధాలు కలిగి ఉండడం ఇందుకు అసలైన కారణాలుగా తెలుస్తోంది. విదేశాల నుంచి హవాలా మార్గాల్లో భారీగా నిధులు సమీకరించినట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాలు పీఎఫ్ఐ ను బ్యాన్ చేయాలని ఇప్పటికే సిఫారసు చేశారు. అయితే ఒక వర్గానికి చెందిన వారిని రెచ్చగొట్టి దేశానికి వ్యతిరేకంగా పీఎఫ్ఐ తయారు చేస్తోందన్న ఆరోపణలు ఇప్పుడు నిషేధానికి కారణమయ్యాయి. దీంతో తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ 2006లో ఏర్పాటయింది. అయితే మొదట కేరళలో ప్రారంభమై.. ఆ తర్వాత దేశమంతటా విస్తరించింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. మైనారిటీలు, దళితులు, అణగారిన వర్గాల సాధికారతే లక్ష్యంగా పనిచేయనున్నామని... అందుకోసం సామాజిక ఉద్యమాన్ని నడుపుతున్నట్లు వెల్లడించింది. కానీ ఈ ముసుగులో రాడికల్ ఇస్లాంను ప్రచారం చేస్తోందని భద్రతా సంస్థలు ఆరోపించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు పిలుపునివ్వడం, హింసాత్మక ఘటనలకు పాల్పడడం, కరాటే పేరుతో యువతకు ఉగ్రవాద శిక్షణ ఇవ్వడం, అమాయక యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు ప్రోత్సహించడం.. వంటి కార్యకలాపాలు చేస్తున్నట్లు పీఎఫ్ఐపై ఆరోపణలున్నాయి.
సెప్టెంబరు 22న ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో ఎన్ఐఏ (కేంద్ర దర్యాప్తు సంస్థ) పీఎఫ్ఐపై దాడులు నిర్వహించింది. ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, అసోం, బీహార్, రాజస్థాన్ సహా మొత్తం 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసింది. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతలు, కార్యకర్తల ఇళ్లల్లో సోదాల అనంతరం.. వందల్లో అరెస్టయ్యారు. ఈ సోదాల్లో ల్యాప్టాప్స్, పెన్డ్రైవ్స్ సహా పలు ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నేతల విచారణలో కీలక వివరాలను రాబట్టారు. మంగళవారం కూడా పలు రాష్ట్రాల్లో సోదాలు జరిగాయి. అస్సాంలో 25 మందిని, మహారాష్ట్రలో నలుగురు, ఢిల్లీలో 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్లో 21 మందిని, గుజరాత్లో 10 మందిని, కర్ణాటకలో కూడా చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.