బెట్టింగ్లు, జల్సాలకు అలవాటుపడి.. రైతులను మోసగించిన సీఈఓ అరెస్ట్

బెట్టింగ్లు, జల్సాలకు  అలవాటుపడి.. రైతులను మోసగించిన సీఈఓ అరెస్ట్
  • పంటను కొని చెక్కులు ఇచ్చి పారిపోయిన సీఈవో అరెస్ట్ 
  • వివరాలు వెల్లడించిన నిర్మల్ ఏఎస్పీ అవినాశ్​ కుమార్​

భైంసా, వెలుగు : బెట్టింగ్ లు.. జల్సాలకు అలవాటు పడి రైతులను మోసగించిన మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం సీఈవోను నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మీడియాకు ఏఎస్పీ అవినాశ్​ కుమార్​ తెలిపిన ప్రకారం.. కుభీర్​మండల కేంద్రంలోని మహిళ రైతు ఉత్పత్తిదారుల సంఘం సీఈవో సంగి శ్రీనివాస్.. కుభీర్, లోకేశ్వరం మండలాల్లో 39 మంది రైతుల వద్ద జొన్న, మొక్క జొన్న, సోయా పంటను కొనుగోలు చేశాడు. డబ్బు చెల్లింపులకు రైతులకు చెక్కులు ఇవ్వగా బ్యాంకుల్లో బౌన్స్​అయ్యాయి. 

దీంతో తాము మోసపోయామని తెలుసుకుని రైతులు కుభీర్, లోకేశ్వరం పోలీస్​స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ జానకీ షర్మిలా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం కుభీర్​మండలం పార్డి (బి) క్రాస్​ రోడ్డు వద్ద నిందితుడు సంగి శ్రీనివాస్ పట్టుకున్నట్టు .. అతని వద్ద రూ. 9 లక్షల నగదును స్వాధీనం చేసుకుని శుక్రవారం రిమాండ్​కు పంపినట్లు  ఏఎస్పీ అవినాశ్ కుమార్ ​తెలిపారు.  39 మంది రైతులకు సుమారు రూ. 53లక్షలు చెల్లించాల్సి ఉన్నట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. భైంసా రూరల్​సీఐ నైలు, కుభీర్​ఎస్ఐ కృష్ణారెడ్డిని ఎస్పీ అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు.  ​