
- పంటను కొని చెక్కులు ఇచ్చి పారిపోయిన సీఈవో అరెస్ట్
- వివరాలు వెల్లడించిన నిర్మల్ ఏఎస్పీ అవినాశ్ కుమార్
భైంసా, వెలుగు : బెట్టింగ్ లు.. జల్సాలకు అలవాటు పడి రైతులను మోసగించిన మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం సీఈవోను నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మీడియాకు ఏఎస్పీ అవినాశ్ కుమార్ తెలిపిన ప్రకారం.. కుభీర్మండల కేంద్రంలోని మహిళ రైతు ఉత్పత్తిదారుల సంఘం సీఈవో సంగి శ్రీనివాస్.. కుభీర్, లోకేశ్వరం మండలాల్లో 39 మంది రైతుల వద్ద జొన్న, మొక్క జొన్న, సోయా పంటను కొనుగోలు చేశాడు. డబ్బు చెల్లింపులకు రైతులకు చెక్కులు ఇవ్వగా బ్యాంకుల్లో బౌన్స్అయ్యాయి.
దీంతో తాము మోసపోయామని తెలుసుకుని రైతులు కుభీర్, లోకేశ్వరం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ జానకీ షర్మిలా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం కుభీర్మండలం పార్డి (బి) క్రాస్ రోడ్డు వద్ద నిందితుడు సంగి శ్రీనివాస్ పట్టుకున్నట్టు .. అతని వద్ద రూ. 9 లక్షల నగదును స్వాధీనం చేసుకుని శుక్రవారం రిమాండ్కు పంపినట్లు ఏఎస్పీ అవినాశ్ కుమార్ తెలిపారు. 39 మంది రైతులకు సుమారు రూ. 53లక్షలు చెల్లించాల్సి ఉన్నట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. భైంసా రూరల్సీఐ నైలు, కుభీర్ఎస్ఐ కృష్ణారెడ్డిని ఎస్పీ అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు.