తెలంగాణలో ఫస్ట్ డే 100 నామినేషన్లు

తెలంగాణలో ఫస్ట్ డే 100 నామినేషన్లు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. శుక్రవారం తొలిరోజు 100 నామినేషన్లు దాఖలయ్యాయని సీఈవో కార్యాలయం వెల్లడించింది. అందులో ఎక్కువ మంది ఇండిపెండెంట్లే ఉన్నారు. ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్​ దాఖలు చేశారు. అటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తరఫున కొడంగల్​లో ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వికారాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్ వేశారు. 

మంచి రోజు కావడంతో తొలి నామినేషన్ వేశానని, నవంబర్‌ 9న బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మరో సెట్‌ దాఖలు చేస్తానని నిర్మల్‌ బీజేపీ అభ్యర్థి మహేశ్వరరెడ్డి ప్రకటించారు. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి రత్నం తరఫున ఆయన కుమారుడు నామినేషన్‌ సమర్పించారు. బెల్లంపల్లి, భూపాలపల్లిలోనూ బీజేపీ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు నామినేషన్ దాఖలయ్యాయి.