
టాలీవుడ్ యువ నటుడు చైతన్య రావు (Chaitanya Rao), భూమి శెట్టి(Bhumi Shetty) జంటగా కుమార స్వామి(Kumara Swamy) (అక్షర) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’(Sharathulu Varthisthai). స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డా.కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు.
లేటెస్ట్గా షరతులు వర్తిస్తాయి సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. పల్లెటూరి కథ..వారి ప్రేమలు..కుటుంబంలో నెలకొన్న సమస్యలను టీజర్లో కళ్ళకు కట్టినట్లు చూపించారు. కరీంనగర్ జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన చిరంజీవి..తమ్ముడు..ఫోన్ ఇప్పియరాదు అన్న, చెల్లి..కోచింగ్ ఫీజు కట్టాలి అన్న..ఇలా కుటుంబ బాధ్యతలను భుజానికి ఎత్తుకొని బ్రతుకుతుంటాడు చిరంజీవి. అయితే అదే ప్రాంతానికి చెందిన విజయశాంతితో చిరంజీవి ప్రేమలో పడతాడు.
ఇష్టాలు..కష్టాలు..బాధలు..బంధాలు తెలిపే టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు, కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి. అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పన్నెండు గుంజాల సాంగ్ ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. మధ్య తరగతి కుటుంబాలలో డబ్బుతో నెలకొన్న సమస్యలను..దర్శకుడు కుమార స్వామి ఆసక్తిగా చూపించినట్లు టీజర్ చూస్తే అర్ధమవుతోంది.