హైదరాబాద్, వెలుగు: కేటీఆర్, హరీశ్ రావు తెలంగాణ భవన్లో కూర్చొని పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మానుకోవాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ హెచ్చరించారు. ఇకముందు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే సిటీ కాంగ్రెస్ కార్యకర్తలు బావా–బామ్మర్దులను ఉరికించి కొట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు. గురువారం గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పులపై చర్చించేందుకు ఆధారాలతో సహా కేటీఆర్, హరీశ్ రావు అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉంటూ మంత్రులను తెలంగాణ భవన్కు వచ్చి చర్చించాలని ఆహ్వానించడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి చర్చించాలనే కనీస రాజకీయ పరిజ్ఞానం కూడా లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.
