విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతున్న చండీఘడ్ యూనివర్సిటీకి సెప్టెంబరు 24 వరకు సెలవులను ప్రకటించారు. దీంతో కొంతమంది విద్యార్థులు ఇప్పటికే వర్సిటీ క్యాంపస్ ను వదిలి ఇళ్లకు వెళ్లిపోయారు. వర్సిటీ హాస్టల్ లోని కొందరు విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలను ఓ విద్యార్థిని రహస్యంగా రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం సృష్టించింది. దీనిపై ఆదివారం వర్సిటీ క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళనలు మిన్నంటాయి. బాధిత విద్యార్థులకు అండగా ఉంటామని ఆప్ ప్రకటించింది.
మరోవైపు వీడియోలు తీసిన ఘటనతో సంబంధమున్నట్లుగా భావిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా, మరొకరినిఅదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్.. నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.