ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూటీడీపీ అధినేత చంద్రబాబు దాఖలుచేసిన ఎస్ఎల్పీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్కుమార్ వాదనలు వినిపించారు..
తొలుత సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ పిటిషనర్పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయిందని తెలిపారు. ఫైబర్నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే చెప్పారన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్కుమార్ వాదిస్తూ ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోందని.. ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపామని చెప్పారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ముందుగా తీర్పు వెలువరిస్తామని.. ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటి వరకు ఫైబర్ నెట్ కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. అంతవరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది. ఫైబర్నెట్ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 9న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.