హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్కు వచ్చిన టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ప్రత్యేక విమానంలో బుధవారం బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకోగా.. అక్కడికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘వీ ఆర్ విత్ యూ సీబీఎన్’, ‘న్యాయమే గెలిచింది’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
కొందరు అభిమానులు బస్తాల కొద్దీ కొబ్బరి కాయులు కొట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా టీడీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకుని స్వాగతం పలికారు. సాయంత్రం 6 గంటలకు మొదలైన ర్యాలీ రాత్రి 8:12కు జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి చేరుకుంది.
భారీగా ట్రాఫిక్ జామ్..
చంద్రబాబు కాన్వాయ్ వెంట వందలాది వాహనాలతో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించడంతో సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట్ నుంచి పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రూట్లతో పాటు ఖైరతాబాద్, అమీర్ పేట్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.