
- ప్రొఫెసర్ కోదండరాంకు ఓయూ విద్యార్థుల వినతి
ఓయూ,వెలుగు : తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులను గుర్తించి భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీకి కాంగ్రెస్ చాన్స్ ఇవ్వాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ కోరారు. ఆదివారం ఆయన ఓయూ విద్యార్థులతో కలిసి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాంను తార్నాకలోని ఇంటికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. అనంతరం దయాకర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటులో ప్రొ. కోదండరాం పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఆయన సేవలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీగా చేస్తే.. బీఆర్ఎస్ నేతలు అడ్డుకుని కోర్టులో కేసు వేసి ఆపేయడం చాలా బాధాకరమన్నారు. గద్దర్ పేరిట అవార్డును ఇవ్వడాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కవులు, కళాకారులను ఎలా గుర్తిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన ఓయూ విద్యార్థులను కూడా గుర్తించాలని ఆయన కోరారు.