హైదరాబాద్లో ఇటీవలే ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ – గరుడ బస్సులకు ఛార్జింగ్ చాలట్లేదు. కారణం ట్రాఫిక్ జామ్. మీరు విన్నది నిజమే. ట్రాఫిక్ కారణంతో 150 కి.మీ.లు నడిచే బస్సు.. సామర్థ్యం మేర రీచ్ కాలేకపోతోంది. ఎలక్ట్రిక్ బస్సుల బ్యాటరీలోని ఛార్జింగ్ను ట్రాఫిక్ జామ్లు హరిస్తున్నాయి. దీంతో బస్సు గమ్యం చేరేందుకు అవసరమైన ఛార్జింగ్ లేకపోవడంతో మధ్యలో మరోసారి బ్యాటరీని ఛార్జ్ చేయాల్సి వస్తోంది. ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ– గరుడ బస్సులకు ఇదే ఇప్పుడు తలనొప్పిగా మారింది.
ఆర్టీసీ పది ఎలక్ర్టిక్ బస్సులను విజయవాడకు తిప్పుతోంది. వీటిని బీహెచ్ఈఎల్లో డిపో ద్వారా నిర్వహిస్తుండగా.. మియాపూర్ డిపోలో ఛార్జింగ్ పెడుతున్నారు. అక్కడి నుంచి ఎంజీబీఎస్కు చివరికి విజయవాడ కు చేరుకుంటుంది. మియాపూర్ ఎంజీబీఎస్ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ఉంటోంది. దీంతో బస్సుకు తరచూ బ్రేకులు వేయాల్సి వస్తోంది. దీంతో పవర్ చాలా ఖర్చవుతోంది. ఎంజీబీఎస్ నుంచి చౌటుప్పల్ వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుండగా.. మొత్తంగా 150 కి.మీ.లు నడవాల్సిన బస్సు పవర్ సిటీలోనే ఖర్చవుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
తర్వాత సూర్యాపేటలో ఛార్జ్ చేస్తున్నారు. ఇందు కోసం బస్సుని బ్రేక్ టైం అని ఆపడంతో ప్రయాణికులు అసహనానికి లోనవుతున్నారు. చప్పుడు లేకపోవడం, ఏసీ బస్సులు కావడం వల్ల ప్రయాణికులు వీటిల్లో ప్రయాణించడానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. విజయవాడ నుంచి తిరుగు ప్రయాణంలో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. మధ్య మధ్యలో ఛార్జింగ్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నయ మార్గాలు చూడాలని పబ్లిక్ కోరుతున్నారు.