శేరిలింగంపల్లి, వెలుగు: వివాదాలకు కేరాఫ్ అయిన దర్శకుడు రాంగోపాల్ వర్మపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో సోమవారం చీటింగ్ కేసు నమోదైంది. శేఖర్ ఆర్ట్ క్రియేషన్ యజమాని శేఖర్ రాజు ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. 'దిశ' సినిమా నిర్మాణ సమయంలో వర్మ తన నుంచి రూ.56 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో శేఖర్ రాజు పేర్కొన్నారు. సినిమా రిలీజ్ తర్వాత మొత్తం తిరిగి చెల్లిస్తానని ఒప్పుకుని డబ్బులు ఇవ్వడం లేదని తెలిపారు. ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.