
- బాధితుడి దగ్గరి నుంచి రూ.లక్షా 80 వేలు వసూలు
- ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: కరోనా ట్రీట్మెంట్కు వాడే యాంటీ వైరల్ ఇంజక్షన్లను సప్లయ్ చేస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్ కు చెందిన వినోద్ బంధువుకి ఏప్రిల్లో కరోనా సోకడంతో గుంటూరులోని ఓ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్కు యాంటీవైరల్ ఇంజక్షన్ అవసరం కావడంతో వినోద్ ఇండియా మార్ట్ఈ–కామర్స్ సైట్లో టోసిలిజుమాబో మెడిసిన్ కోసం వెతికాడు. హెల్త్ కేర్ పేరుతో ఓ సర్వీసును చూసి అందులో ఇంజక్షన్ల కోసం రిక్వెస్ట్ పెట్టాడు. కొంతసేపటికి రాకేశ్ ప్రసాద్ కండెల్వల్ పేరుతో ఓ వ్యక్తి వినోద్కు కాల్ చేశాడు. 3 గంటల్లో 5 ఇంజక్షన్లను గుంటూరుకు సప్లయ్ చేస్తానని నమ్మించి వినోద్ దగ్గరి నుంచి రూ.లక్షా80 వేల774 ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. ఇంజక్షన్లు డెలివరీ కాకపోవడంతో వినోద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. బ్యాంక్ అకౌంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బెంగుళూరు అడ్డాగా నైజీరియన్లు జఫ్ డెక్లన్(34), మాథియస్ షా(33) ఇలాంటి మోసాలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. నిందితులను బెంగుళూరులో అరెస్ట్ చేసి గురువారం సిటీకి తీసుకొచ్చి రిమాండ్కి తరలించారు.