- హైకోర్టుకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ నివేదిక
- కౌంటర్ దాఖలు చేస్తామన్న చెన్నమనేని అడ్వకేట్
- విచారణ 2 వారాలు వాయిదా
హైదరాబాద్, వెలుగు: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు జర్మనీ సిటిజన్ షిప్ ఉందని హైకోర్టుకు కేంద్ర హోం శాఖ సెక్రటరీ అశుతోష్ ఆనంద్ తెలిపారు. మన దేశ సిటిజన్ షిప్ తీసుకున్న తర్వాత కూడా ఆయన జర్మనీ పౌరసత్వాన్ని కొనసాగించారని నివేదిక అందజేశారు. చెన్నమనేని 2009లో ఇండియన్ సిటిజన్ షిప్ తీసుకున్నారని, అప్పటికే ఆయనకు 2013 వరకూ చెల్లబాటులో ఉండే జర్మనీ పాస్పోర్టు ఉందన్నారు. ఆ పాస్పోర్టు 2023 వరకూ ఉండేలా జర్మనీ ఎంబసీలో రెన్యువల్ చే యించుకున్నారని తెలిపారు. చెన్నమనేని డబుల్ సిటిజన్ షిప్ పై దాఖలైన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు. తమ పాస్పోర్టు ఉన్నంత మాత్రాన తమ దేశ పౌరుడని చెప్పలేమని జర్మనీ విదేశాంగ శాఖ చెప్పిందని, అయితే రెండు దేశాల పౌరసత్వం పొందితే పాస్పోర్టును రెన్యువల్ చేయబోమని కూడా చెప్పిందన్నారు. చెన్నమనేని జర్మనీ పాస్పోర్టుపైనే విదేశీ పర్యటనలు చేశారని, జర్మనీ పౌరుడిగా చెప్పుకునే పాస్ పోర్టును రెన్యువల్ చేయించుకున్నారని పేర్కొన్నారు. దీనిపై తమ వాదనలతో రిప్లై కౌంటర్ వేస్తామని చెన్నమనేని లాయర్ కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి అనుమతిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.