
వికారాబాద్, వెలుగు: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భయమెందుకో చెప్పాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం వికారాబాద్ లోని మా శారద ఆసుపత్రిలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చరణ్ రెడ్డి ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ఇంట్లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ అఖండ భారత్లో భాగంగా వన్నేషన్.. వన్ఎలక్షన్తీసుకొస్తుంటే కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు.
పేద ముస్లింలకు అన్యాయం చేస్తున్న వక్ఫ్ బోర్డును వెంటనే రద్దు చేయాలని, ఈ చట్టం అప్పటి కాంగ్రెస్ చేసిన కుట్ర అని విమర్శించారు. బీజేపీకి దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయి ప్రజల మద్దతు ఉందన్నారు. పార్లమెంట్లో సభ్యుల మధ్య కోపాలు పెరిగిపోతున్నాయని ఒకప్పుడు సమావేశాలు సరదగా సాగేవని చెప్పారు. ఎంపీగా గెలిచిన మూడు రోజులకే చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలోని రైల్వే సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కోటపల్లి ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి రూ.100 కోట్లు తీసుకొచ్చానన్నారు. అనంతగిరిలో టూరిజాన్ని మరింత డెవలప్చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ వికారాబాద్జిల్లా అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి, వికారాబాద్ కో ఆర్డినేటర్ వడ్ల నందు పాల్గొన్నారు.