గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల పరిధిలోని ఏలికట్ట గ్రామంలో ఓ వ్యక్తి చికెన్​ తింటుండగా గొంతులో ముక్క ఇరుక్కొని చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. జార్కండ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారి కొంతకాలంగా ఎలికట్టలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ దగ్గరలోని ఓ కంపెనీలో పని చేస్తున్నారు. మంగళవారం రాత్రి చికెన్​ తెచ్చుకుని వండుకున్నారు. పూరీలు చేసుకొని మద్యం తాగుతూ భోజనం చేస్తుండగా, జితేంద్రకుమార్ ఒక్కసారిగా కిందపడి గిలగిల కొట్టుకున్నాడు.

ధర్మేందర్​, పక్కన ఉంటున్న వారు పరిశీలించగా చనిపోయి ఉన్నాడు. పోలీసులకు చెప్పడంతో వారు క్లూస్​టీమ్​ను తీసుకువచ్చి పరిశీలించారు. తర్వాత మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం షాద్ నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ డాక్టర్లు చెక్​ చేయగా గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని ఉంది. చికెన్​ ముక్క ఇరుక్కోవడం వల్లే ఊపిరాడక చనిపోయాడని ప్రకటించారు.