మనవడి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ లో సీఎం కేసీఆర్

మనవడి  గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ లో సీఎం కేసీఆర్

ఉన్నత చదువులు చదివి.. జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని 12 క్లాస్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న తమ మనుమడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఆశీర్వదించారు. మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలిలోని వోక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి 12వ క్లాస్ ను పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా తాను చదువుతున్న స్కూల్ లో ‘12 క్లాస్ గ్రాడ్యుయేషన్ డే’వేడుకలను ఏప్రిల్ 18వ తేదీ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత, నాయనమ్మలైన సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు, తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, చెల్లెలు అలేఖ్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 

‘గ్రాడ్యుయేషన్ డే’ సందర్భంగా 12వ తరగతిని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఓక్రిడ్జ్ స్కూలు యాజమాన్యం గ్రాడ్యుయేషన్ పట్టాలను  అందజేశారు. విద్యనభ్యసిస్తూనే క్రీడలు, సాంస్కృతిక రంగం, సామాజిక సేవ వంటి రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ, విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ప్రతిభా పురస్కారాలు అందజేసింది. ఇందులో భాగంగా.. హిమాన్షు ‘కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్’ (సిఎఎస్) విభాగంలో గొప్ప ప్రతిభను ప్రదర్శించారు. దాంతో హిమాన్షును సీఎఎస్ విభాగంలో ఎక్స్ లెన్స్ అవార్డు అందజేశారు. 

గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాన్షు.. స్టేజీ దిగివచ్చి తమ తాత సీఎం కేసీఆర్ చేతుల్లో గ్రాడ్యుయేషన్ పట్టాను పెట్టి పాదాలకు నమస్కరించారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. చిన్నతనం నుంచి తమ చేతుల్లో పెరిగి ఇవాళ పట్టభద్రుడిగా ఎదిగిన మనువడిని హృదయపూర్వకంగా అభినందించారు సీఎం కేసీఆర్. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనుమడిని కేసీఆర్ ఆశీర్వదించారు.  

ఈ కార్యక్రమంలో హిమాన్షు అమ్మమ్మ, మేనమామలు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హిమాన్షురావుతో పాటు గ్రాడ్యుయేషన్ పట్టాను పొందిన  క్లాస్ మేట్ ఆద్విత్ బిగాల తండ్రి, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, వారి పెదనాన్న ఎమ్మెల్యే గణేష్ బిగాల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రాడ్యుయేషన్ డే సంద్భంగా పట్టాలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సమావేశ మందిరం కిక్కిరిసింది. విద్యార్థుల హర్షధ్వానాలతో ప్రాంగణం మారు మోగింది.