చొప్పదండి, వెలుగు: చొప్పదండి శివారులోని గుమ్లాపూర్లో ఈ నెల 5న సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటనను పురస్కరించుకుని సోమవారం సభా ప్రాంగణం, హెలీప్యాడ్, పార్కింగ్ స్థలాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీపీ గౌష్ ఆలం పరిశీలించారు. సభా ప్రాంగణం మ్యాప్ ఆధారంగా భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బారికేడ్ల ఏర్పాటును సీపీ పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన బారికేడ్ విధానం అమలుచేయాలని అధికారులను ఆదేశించారు.
సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా క్షుణ్ణంగా పర్యవేక్షించారు. సభకు వచ్చే వాహనాల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాలను పరిశీలించి, ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సీపీకి సూచించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, లీడర్లు పాల్గొన్నారు.
