ఆ ఘటన జరిగిన రెండో రోజే భూమి మ్యుటేషన్ పూర్తి
అంత చిన్న పని ఎందుకు ఆపారంటున్న రైతు సంఘాలు
అధికారులపై చర్యలకు డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ ఆఫీస్లో, సిబ్బందిపై పెట్రోల్ చల్లిన కేసులో అరెస్టయిన రైతు కనకయ్య ఇంకా జైల్లోనే ఉన్నారు. కరీంనగర్జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లికి చెందిన జీల కనకయ్యకు చిగురుమామిడి రెవెన్యూ పరిధిలో 4.26 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో19 గుంటలకే అధికారులు పట్టా ఇచ్చారు. మిగతా భూమికి పాస్పుస్తకం ఇవ్వాలని ఏడాదిన్నరగా తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగినా పని కాలేదు. దీంతో కనకయ్య ఈ నెల 19న సిబ్బంది, అధికారులపై, వారు కూర్చున్న సీట్లపై పెట్రోల్చల్లడంతో పోలీసులు అరెస్టు చేశారు. అన్నదమ్ముల మధ్య గొడవ వల్లే పాస్బుక్ ఇవ్వలేదని ముందు ప్రకటించిన అధికారులు 21వ తేదీన మ్యుటేషన్ చేసేశారు. ఇన్నాళ్లూ తిప్పుకుని, రెండు రోజుల్లోనే పని ఎలాచేశారంటూ బాధితుడి తరఫువారు ప్రశ్నిస్తున్నారు. కావాలనే రైతు కనకయ్యను సతాయించారని, ఇందుకు కారణమైన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇంత చిన్న పనిని అధికారులు ముందే ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
