దత్తత పేరుతో.. దళారుల దందా !..దంపతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని పిల్లల విక్రయం

దత్తత పేరుతో.. దళారుల దందా !..దంపతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని పిల్లల విక్రయం
  • సంతానం లేనివాళ్లు ‘కారా’ ద్వారా దత్తత తీసుకునే చాన్స్‌‌
  • ఆలస్యం, అవగాహనలోపంతో అడ్డదారులు తొక్కుతున్న దంపతులు
  • చివరకు పోలీసులకు చిక్కి కేసులపాలు
  • శిశుగృహాలు, బాలసదన్‌‌లలో వందలాది మంది చిన్నారులు
  • ఆలస్యమైనా లీగల్‌‌గానే తీసుకోవాలంటున్న ఆఫీసర్లు

హనుమకొండ, వెలుగు : పిల్లల్ని కని వారిని అల్లారుముద్దుగా పెంచుకోవాలని ఏ మహిళకైనా ఉంటుంది. కానీ ఏదైనా కారణం వల్ల సంతానం కలగని దంపతులు చట్టబద్ధంగా దత్తత తీసుకునే అవకాశం ఉంది. కానీ ఈ విధానంపై అవగాహన లేకపోవడం, ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితిని కొందరు దళారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి, పిల్లలు లేని దంపతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడితే అమాయకులైన దంపతులు సైతం జైలుకు వెళ్లాల్సి వస్తుంది. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఈ తరహా దందా పడగా.. తాము పెంచుకుంటున్న పిల్లలను ఆఫీసర్లకు అప్పగించలేక ఆ తల్లిదండ్రులు విలవిల్లాడిపోయారు. అయితే ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు.

‘కారా’తో దత్తతకు చాన్స్‌‌

వివిధ కారణాల వల్ల అనాథలైన పిల్లలకు ప్రభుత్వం శిశుగృహాలు, బాలసదన్‌‌లలో ఆశ్రయం కల్పిస్తోంది. వీటిలో పెరుగుతున్న పిల్లలను లీగల్‌‌గా దత్తత ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా కారా (సెంట్రల్‌‌ అడాప్షన్‌‌ రిసోర్స్ అథారిటీ) అనే సంస్థ పని చేస్తోంది. ఇందులో అప్లికేషన్‌‌ పెట్టుకుంటే ఏ రాష్ట్రానికి చెందిన పిల్లలనైనా దత్తత తీసుకోవచ్చు. ఇందుకు ముందుగా దంపతుల ఫొటో, మ్యారేజ్‌‌ సర్టిఫికెట్‌‌, వయసు, పాన్‌‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్‌‌ కార్డులను ‘కారా’ వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

పిల్లలను పెంచుకునేందుకు సరిపడా ఆదాయం ఉన్నట్లు ఇన్‌‌కం సర్టిఫికెట్‌‌ సైతం సమర్పించారు. అప్లికేషన్‌‌ టైంలోనే ప్రభుత్వానికి రూ.6 వేలు డీడీ చెల్లించడంతో పాటు దత్తత తీసుకునే టైంలో మరో రూ.50 వేలు డీడీ కట్టాలి. దత్తత ముగిసిన తర్వాత ప్రతి ఆరు నెలలకోసారి డిస్ట్రిక్ట్‌‌ చైల్డ్‌‌ ప్రొటెక్షన్‌‌ ఆఫీసర్లు ఇంటికొచ్చి పిల్లల బాగోగుల గురించి ఆరా తీస్తారు. ఇలా రెండేండ్ల కాలంలో నాలుగు సార్లు ఫీల్డ్‌‌ వెరిఫై చేయనుండగా, ప్రతి విజిట్‌‌ సందర్భంగా సదరు పేరెంట్స్ రూ.2 వేల చొప్పున డీడీ చెల్లించాలి.

ఇంటర్‌‌ కంట్రీ అడాప్షన్‌‌తో ఇతర దేశాలకు...

కారా వెబ్‌‌సైట్‌‌లో దరఖాస్తు చేసుకుంటే ఇతర దేశాల్లో ఉన్న వారు సైతం ఇక్కడి పిల్లలను దత్తత తీసుకోవచ్చు. ఇంటర్‌‌ కంట్రీ అడాప్షన్‌‌ పేరుతో పిల్లలను ఇతర దేశాలకు దత్తత ఇస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 224 మంది పిల్లలను దత్తత ఇవ్వగా.. అందులో 12 మంది చిన్నారులను ఇటలీ, మాల్టా, యూకే, యూఎస్‌‌ఏ వంటి దేశాలకు చెందిన దంపతులకు ఇచ్చారు. ఇంకా హనుమకొండలోని శిశుగృహలో 8 మంది, బాలసదన్‌‌లో 30 మంది చిన్నారులు దత్తత కోసం ఎదురుచూస్తుండగా, రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది చిన్నారులు ఉన్నారు.

అవగాహనాలోపం.. ఆపై ఆలస్యం..

కారా వెబ్‌‌సైట్‌‌లో అప్లికేషన్‌‌ చేసుకోగానే ఆ వివరాలన్నీ సంబంధిత జిల్లా ఆఫీసర్లకు చేరుతాయి. వాటి ప్రకారం డిస్ట్రిక్ట్‌‌ వెల్ఫేర్‌‌ ఆఫీసర్లు ఫీల్డ్‌‌ వెరిఫికేషన్‌‌ చేసి, వివరాలను ధ్రువీకరిస్తారు. ఆ తర్వాత దరఖాస్తులదారుల వయసును బట్టి సంబంధిత జిల్లా శిశుగృహ, బాలసదన్‌‌లో ఉన్న పిల్లల దత్తతకు ‘కారా’ అంగీకరిస్తుంది. అనంతరం కలెక్టర్‌‌ సమక్షంలో పిల్లలను దంపతులకు అప్పగిస్తారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం ముగియడానికి రెండు, మూడేండ్లకు మించి సమయం పడుతోంది. 

పిల్లలతో దళారుల అక్రమదందా

చట్టబద్ధ దత్తతకు చాలా సమయం పడుతుండడంతో దళారులు ఎంటర్‌‌ అవుతున్నారు. దంపతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇతర ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగుచూసింది. సూర్యాపేటకు చెందిన యాదగిరి- ఉమారాణి దంపతులు ముంబై, గుజరాత్‌‌కు చెందిన ముఠాల ద్వారా పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. వారు వివిధ ప్రాంతాల నుంచి 28 మంది చిన్నారులను తీసుకొచ్చి ఇక్కడ అమ్మినట్లు తేలింది. పోలీసులు 10 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. శిశువిక్రయదందాకు పాల్పడిన 13 మందిని పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. దళారులను నమ్మి చిన్నారులను తీసుకున్న దంపతులు సైతం ఓ వైపు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మరో వైపు కేసుల పాలుకావాల్సి వస్తోంది.

పిల్లలపై నిరంతర పర్యవేక్షణ 

మాతృత్వానికి దత్తత మరో మార్గం. కారా వెబ్‌‌సైట్‌‌లో అప్లై చేసుకున్న వారికి ఎంక్వైరీ తర్వాత చట్టబద్ధంగా పిల్లలను అప్పగిస్తాం. ఇక్కడి రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల దంపతులకు ఇచ్చిన పిల్లలను అక్కడి దత్తత ఏజెన్సీల ద్వారా పర్యవేక్షిస్తాం. ఒకవేళ ఎవరైనా పిల్లలను ఇబ్బందులకు గురి చేసినట్లు తెలిస్తే దత్తత క్యాన్సిల్‌‌ చేసే అవకాశం ఉంటుంది.- జయంతి, డిస్ట్రిక్ట్‌‌ వెల్ఫేర్‌‌ ఆఫీసర్‌‌, హనుమకొండ

పిల్లలను భారంగా భావిస్తే మాకు ఇవ్వవచ్చు పిల్లలు వద్దనుకునో.. ఆడపిల్లలు పుట్టారనో చాలా మంది బయట వదిలేస్తున్నారు. పిల్లలను భారంగా భావించే వాళ్లు ఎవరైనా జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి  అప్పగిస్తే.. వారి బాధ్యతను మేమే చూసుకుంటాం. చిన్నారుల వివరాలను కారా వెబ్‌‌సైట్‌‌లో నమోదు చేసి, ఆ తర్వాత చట్టబద్ధంగా దత్తత ఇస్తాం. దీని వల్ల మరికొందరికి పిల్లలను పెంచుకునే అవకాశం దక్కుతుంది.- ఎస్‌‌.ప్రవీణ్‌‌కుమార్‌‌, ఇన్‌‌చార్జి డీసీపీవో, హనుమకొండ