- 3,245 మందికి సోకిన బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్
- ఫార్మాస్యుటికల్ కంపెనీ లీకేజీ వల్లేనన్న అధికారులు
- ఇన్ ఫెక్షన్ తో జ్వరం,అవయవాల వాపులు
బీజింగ్: బ్రూసెల్లోసిస్.. కరోనా వైరస్ పుట్టిన చైనాలో మోపైన ఇంకో రోగం ఇది. కరోనాను అధికారికంగా ప్రకటించిన కొద్ది నెలల ముందే అక్కడ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మొదలైంది. ఓ ఫార్మాస్యుటికల్ కంపెనీలో జరిగిన లీకేజీ వల్ల బ్యాక్టీరియా జనాలకు సోకింది. గన్షూ ప్రావిన్స్ రాజధాని అయిన లాంఝౌలో 3,245 మంది దాని బారిన పడ్డట్టు ఆ సిటీ హెల్త్ కమిషన్ ప్రకటించింది. ప్రావిన్స్లోని 21,487 మందికి టెస్టులు చేయగా 15 శాతం మందికి పాజిటివ్గా తేలినట్టు చెప్పింది. పోయినేడాది జులై, ఆగస్టు నెలల్లో లాంఝౌలోని ఝోంగ్ము లాంఝౌ బయాలాజికల్ ఫార్మాస్యుటికల్ ఫ్యాక్టరీలో జరిగిన లీకేజే దానికి కారణమని పేర్కొంది. పశువుల కోసం బ్రూసెల్లా వ్యాక్సిన్ను తయారు చేసే క్రమంలోనే ఈ బ్యాక్టీరియా లీకైందంటున్నారు. డేట్ దాటిపోయిన డిసిన్ఫెక్టెంట్లు, శానిటైజర్లు వాడడంతో వేస్ట్గ్యాస్లోని బ్యాక్టీరియా మొత్తం చనిపోలేదని, దీంతో అది బయటకు వ్యాపించిందని చెబుతున్నారు.
ఏంటీ బ్రూసెల్లోసిస్?
బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా నుంచి ఈ బ్రూసెలోసిస్ ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీన్నే మాల్టా ఫీవర్, మెడిటెరేనియన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. బ్రూసెల్లా బ్యాక్టీరియాలో ఐదు రకాలున్నాయి. బ్రూసెల్లా అబార్టస్, బ్రూసెల్లా కేనిస్, బ్రూసెల్లా మెలిటెన్సిస్, బ్రూసెల్లా ఓవిస్, బ్రూసెల్లా సూయిస్. అన్నింటిలోకి బీ మెలిటెన్సిస్ తీవ్రత చాలా ఎక్కువని చెబుతున్నారు నిపుణులు. పాడి పశువులు, మేకలు, గొర్రెలు, పందుల వంటి వాటికి ఈ బ్యాక్టీరియా సోకుతుందని అంటున్నారు. అయితే, మనుషుల నుంచి మనుషులకు బ్రూసెల్లోసిస్ వ్యాపించడం చాలా అరుదని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెబుతోంది. పశువుల నుంచే బ్యాక్టీరియా జనాలకు సోకుతుందని పేర్కొంది. పాడైపోయిన మాంసం తినడం, బాగా కాగబెట్టని పాలు తాగడం, బ్యాక్టీరియాతో నేరుగా కాంటాక్ట్ అవడం వల్లే సోకుతుందని చెప్పింది. బ్యాక్టీరియా సోకిన పశువులను తాకినా, వాటి రక్తాన్ని ముట్టుకున్నా బ్రూసెల్లోసిస్ వస్తుందంటున్నారు నిపుణులు. పశువుల పెంపకందార్లతో పాటు వెటర్నరీ డాక్టర్లు, పాడి రైతులు, మాంసం అమ్మేవాళ్లకు ఇది ఎక్కువగా వస్తుందంటున్నారు. అయితే, సోకిన మొదట్లో దీనిని గుర్తించడం చాలా కష్టమని చెబుతున్నారు. 1980ల నుంచే చైనాలో ఈ బ్రూసెల్లోసిస్ జబ్బు ఉంది. ఆ తర్వాత వ్యాక్సిన్లు రావడం, జబ్బు కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో ఆ కేసులు బాగా తగ్గాయి. బ్రూసెల్లోసిస్ పుట్టింది మాత్రం యూరప్లోని మాల్టాలో. క్రిమియా వార్ జరిగేటప్పుడు 1850లో ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తొలిసారి వెలుగు చూసింది. 2008లో బోస్నియాలో దాదాపు వెయ్యి మంది దాని బారిన పడ్డారు. అమెరికాలో ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని వందల కోట్ల నష్టం కలుగుతోందట. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లోని 60 శాతం ఆడ జడల బర్రెలకు బ్రూసెల్లోసిస్ ఉందని అధికారులు చెబుతున్నారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్ (మాల్టా, ఐర్లాండ్), న్యూజీలాండ్లలోనూ గతంలో దాని ప్రభావం ఉండేది.
జీవాయుధంగా…
20వ శతాబ్దం మధ్యలో బ్రూసెల్లా బ్యాక్టీరియాను కొన్ని పెద్ద దేశాలు జీవాయుధంగానూ తయారు చేసి పెట్టుకున్నాయి. తొలిసారి 1954లో బీ సూయిస్తో బయో వెపన్ను తయారు చేసింది అమెరికా. అయితే, 1971–72లో అన్ని బయోవెపన్స్ను నాటి ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ నాశనం చేయించారు. బ్రూసెల్లాతో మూడు జీవాయుధాలను తయారు చేసింది యూఎస్. పోర్సైన్ బ్రూసెల్లోసిస్ (ఏజెంట్ యూఎస్), బొవైన్ బ్రూసెల్లోసిస్ (ఏజెంట్ ఏఏ), కాప్రిన్ బ్రూసెల్లోసిస్ (ఏజెంట్ ఏఎం) అనే మూడు రకాల బయో వెపన్స్ను తయారు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం నాటికే ఏజెంట్ యూఎస్ తయారీ అడ్వాన్స్ దశకు చేరుకుందట. ఏజెంట్ యూఎస్, ఏజెంట్ ఏఏలతో పోలిస్తే.. ఏజెంట్ ఏఎం తీవ్రత ఎక్కువట.
లక్షణాలేంటి?.. మనకు ముప్పేనా?
చాలా జబ్బులకు ఉండే లక్షణాలే బ్రూసెల్లోసిస్కూ ఉన్నాయి. అయితే, అందులో కొన్ని లక్షణాలు జీవితాంతం అలాగే ఉండిపోయే ముప్పుందని యూఎస్ సీడీసీ చెబుతోంది. తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరం, అలసట, నీరసం వంటివి కామన్గా ఉండే లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. పిత్తాశయం (స్ప్లీన్), గుండె, లివర్, టెస్టికిల్స్ (వృషణాలు) వంటి అవయవాలు వాస్తాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెర్టిలిటీ (సంతాన సమస్యలు) వంటి తీవ్రమైన నష్టాలూ కలుగుతాయంటున్నారు. స్పాండిలైటిస్ వంటి దీర్ఘకాలిక రోగాలూ వస్తాయంటున్నారు. 70% కేసుల్లో జీర్ణాశయ సమస్యలు వేధిస్తాయంటున్నారు. వాంతులు, విరేచనాలు, ఆకలి కాకపోవడం వంటి సమస్యలుంటాయన్నారు.