హైదరాబాద్ : ఆనందయ్య కరోనా ఔషధంపై చిన్నజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు కరోనా రోగుల ప్రాణాలను నిలబెడుతుంటే వివాదం ఎందుకన్నారు. ఆదివారం చిన్నజీయర్ హైదరాబాద్ లోని, ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ ను సందర్శించారు. ఈఎస్ఐ డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కరోనా సమయంలో మనిషి జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ సరైన ఆహారం తీసుకోవాలన్నారు.
అలాగే ఆనందయ్య మందు వివాదంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు చిన్నజీయర్ మాట్లాడుతూ.. ఆనందయ్య ఔషధంతో దుష్ప్రభావాలు లేవని ఆయూష్ కమిటీ నిర్ధారించిందని అన్నారు. ఉచితంగా ఔషధం ఇస్తుంటే అభ్యంతరమెందుకని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సంక్షోభం వేళ వివాదాలు సరికాదని.. ఆనందయ్య మందును పంపిణీ చేసే అవకాశాలను ఏపీ ప్రభుత్వం వెంటనే పరిశీలించాలన్నారు.