చొప్పదండి, వెలుగు: గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. ఎంపీడీవో ఆఫీసులో శనివారం మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా మంజూరైన ఉపాధి హామీ సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాలను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మండలంలోని 60 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్ పర్సన్ పెరుమాండ్ల మానస, మార్కెట్ చైర్మన్ కొత్తూరు మహేష్, వైస్ చైర్మన్ రాజేందర్ పాల్గొన్నారు.
