
- చెల్లింపులు ఆన్లైన్లో కనిపించకుండా మార్పులు
- డేటాబేస్, ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుల ఆధారంగా సీఐడీ దర్యాప్తు
- ప్రాజెక్ట్ రిసోర్స్ పర్సన్ల ఎంక్వైరీ
- బుధవారం ముగ్గురు టెక్నికల్ రిసోర్స్ పర్సన్ల స్టేట్మెంట్లు రికార్డ్
- ‘స్పెషల్ ఇన్సియేటివ్’ గ్రూపులో వచ్చిన ఆదేశాలపై ఆరా
హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ స్కామ్ కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. కమర్షియల్ ట్యాక్స్ యాప్స్, మాడ్యూల్స్ తయారీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సహా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ మెంబర్గా ఉన్న ‘స్పెషల్ ఇన్సియేటివ్స్’ వాట్సాప్ గ్రూపు వివరాలు సేకరిస్తోంది. దర్యాప్తులో భాగంగా బుధవారం ముగ్గురు టెక్నికల్ రిసోర్స్ పర్సన్లను ప్రశ్నించింది. ప్రధానంగా ట్యాక్స్ ఇన్వాయిస్ల కోసం నకిలీ బిల్లులు, ప్రభుత్వం నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందేందుకు ఎలాంటి టెక్నాలజీ వినియోగించారనే వివరాలను సేకరిస్తోంది. గురువారం కూడా మరికొంత మందిని విచారించనున్నారు. దర్యాప్తులో భాగంగా సోమేశ్ కుమార్ను మరోసారి ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో రూ.1,400 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్టు గతేడాది జులైలో హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సర్వీస్ ట్యాక్స్ మాజీ అడిషనల్ కమిషనర్ ఎస్వీ కాశీవిశ్వేశ్వర రావు, మాజీ డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్, ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ సహా ఐదో నిందితుడిగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్పై సీసీఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు తీవ్రత నేపథ్యంలో ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు.
కీలకంగా ‘స్పెషల్ ఇన్సియేటివ్’ వాట్సాప్ గ్రూప్
సీఐడీ దర్యాప్తుతో పాటు వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర కమిషనర్ శ్రీదేవి ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్లియాంటో టెక్నాలజీస్కు చెందిన టెక్నికల్ రిసోర్స్ పర్సన్లను విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ను మరోసారి ప్రశ్నించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసినప్పటికీ.. కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలు, రిసోర్స్ పర్సన్లు ఇస్తున్న సమాచారం ఆధారంగా విచారించనున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లోని 75 కంపెనీలకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. వీరంతా కలిసి ఏర్పాటు చేసుకున్న ‘స్పెషల్ ఇన్సియేటివ్’ వాట్సాప్ గ్రూప్లో సీఐడీకి కీలక ఆధారాలు లభించాయి. దీంతో పాటు జీఎస్టీ చెల్లింపుల్లో జరిగిన అవకతవకలకు చెందిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టులు, సోమేశ్ కుమార్ గ్రూప్ చాటింగ్ రికార్డులు, సీ డాక్ రిపోర్టులను ఇప్పటికే సీఐడీ అధికారులు సేకరించారు.
జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాలు
ఐఐటీ హైదరాబాద్ పర్యవేక్షణలో అవసరమైనప్పుడు డేటాలో మార్పులు చేసుకునే అవకాశం ఉందని ఇప్పటికే ఆయా సాఫ్ట్వేర్ సంస్థలు సీఐడీకి నివేదికలు ఇచ్చాయి. ఈ మేరకు ఐఐటీ నిర్వహణలో ఉన్న డేటాబేస్, ఆడిట్ అప్లికేషన్లకు సంబంధించి సీడాక్ నుంచి కూడా వాణిజ్య పన్నుల శాఖ నివేదిక తెప్పించుకుంది. 75 కంపెనీల్లో పలు కంపెనీలకు సంబంధించిన పన్ను చెల్లింపులను ఆన్లైన్లో కనిపించకుండా, పన్ను ఎగవేసేందుకు కుట్ర చేసినట్లు సీఐడీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఇందులో ప్రధానంగా ‘స్పెషల్ ఇన్సియేటివ్’లో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ గ్రూప్ మెంబర్గా కీలకంగా వ్యహహరించినట్లు తెలిసింది. జీఎస్టీ అధికారులకు సోమేశ్ కుమార్ ఆదేశాలిచ్చారంటూ ఇప్పటికే పలువురు అధికారులు సీఐడీ ముందు వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా తెలిసింది.