లార్డ్స్ వేదికగా స్మృతి మంధాన వరల్డ్ రికార్డ్.. తొలి మహిళా క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర!

లార్డ్స్ వేదికగా స్మృతి మంధాన వరల్డ్ రికార్డ్.. తొలి మహిళా క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర!

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అడుగు పెట్టడమే తరువాయి.. క్రికెట్ చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఇంగ్లండ్‌తో స్టార్ట్ అయిన ఏకైక చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన మంధాన, తన అంతర్జాతీయ కెరీర్‌లో 300వ మ్యాచ్ ఆడి సరికొత్త మైలురాయిని అందుకుంది. ఈ అద్భుత ఘనత సాధించిన ప్రపంచంలోని అతికొద్ది మంది దిగ్గజ ప్లేయర్స్ ఎలైట్ క్లబ్‌లో ఆమె చోటు సంపాదించుకుంది.

హిస్టరీ క్రియేట్ చేసిన మంధాన: 

వచ్చే వారం (జూలై 18న) స్మృతి మంధాన తన 30వ పుట్టినరోజును జరుపుకోబోతుంది. అయితే 30 ఏళ్ల వయస్సుకి ముందే స్మృతి ఈ జేజూయి మార్కును దాటేసింది. దీంతో ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ప్లేయర్‌గా మంధాన సంచలన రికార్డు సృష్టించింది. చాలా తక్కువ వయస్సులోనే టీమిండియా బాధ్యతలను భుజానికెత్తుకుని, తన నిలకడైన ప్రదర్శనతో భారత్ ని ముందుకు తీసుకెళ్లిందని చెప్పడానికి ఈ రికార్డే నిదర్శనం.

టాప్‌లో హర్మన్‌: 

ప్రపంచ క్రికెట్‌లో ఈ మైలురాయిని అందుకున్న 12వ మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన నిలిచింది. అదే సమయంలో భారత మహిళా క్రికెట్ పరంగా చూస్తే.. ఈ అద్భుత రికార్డుని సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచింది. అంతకుముందు ఇద్దరు భారత దిగ్గజాలు మాత్రమే ఈ ఘనత సాధించారు. వారిలో ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 374 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా, ఆమె తర్వాత లెంజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్ (333 మ్యాచ్‌లు) రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇప్పుడు మంధాన కూడా వారి సరసన చోటు దక్కించుకుంది. 

లార్డ్స్‌లో తొలిసారి మహిళల టెస్ట్:

ఈ మ్యాచ్ కేవలం స్మృతి మంధానకు మాత్రమే కాదు, ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రకే అత్యంత ప్రత్యేకం. ఇంగ్లండ్ గడ్డపై ఇప్పటి వరకు 55 మహిళల టెస్ట్ మ్యాచ్‌లు జరగ్గా, అవన్నీ 19 విభిన్న మైదానాల్లో నిర్వహించారు. కానీ, క్రికెట్ మక్కాగా పిలవబడే చారిత్రాత్మక లార్డ్స్ (Lord's) మైదానంలో ఒక మహిళల టెస్ట్ మ్యాచ్ జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. గతంలో వూస్టర్ కాంతి గ్రౌండ్‌లో అత్యధికంగా 9 మ్యాచ్‌లు, ద ఓవల్‌లో 6 టెస్టులు కొనసాగాయి. దీంతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మహిళా క్రికెట్ ఎదుగుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఇంగ్లండ్ గడ్డపై భారత్ రికార్డ్: 

ఇంగ్లండ్ వేదికగా టీమిండియా ఉమెన్స్ టీమ్ కు తిరుగులేని టెస్ట్ రికార్డ్ ఉంది. ఇంగ్లండ్‌లో భారత్‌కు ఇది 10వ టెస్ట్ మ్యాచ్ కాగా.. అంతకుముందు ఆడిన 9 మ్యాచ్‌లలో భారత్ 2 గెలిచింది, మిగిలిన 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అంటే, ఇంగ్లండ్ గడ్డపై ఇండియా ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య జరిగిన 15 టెస్టుల్లో భారత్ 3 గెలిస్తే, ఇంగ్లండ్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. కాగా, ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బౌలింగ్ తీసుకుంది. లార్డ్స్ పిచ్‌పై ఉన్న తేమను ఉపయోగించుకోవాలని ఇంగ్లండ్ చూస్తుండగా.. తన 300వ మ్యాచ్‌ను భారీ సెంచరీతో మరింత చిరస్మరణీయంగా మార్చుకోవాలని స్మృతి మంధాన చూస్తుంది.