Gold: పసిడి ప్రియులారా కంగారొద్దు.. త్వరలోనే బంగారం రేటు తగ్గుతుంది: సిటీ గ్రూప్

Gold: పసిడి ప్రియులారా కంగారొద్దు.. త్వరలోనే బంగారం రేటు తగ్గుతుంది: సిటీ గ్రూప్

Gold Rate Prediction: ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య యుద్ధాల మధ్య బంగారానికి డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికి అనుగుణంగానే స్పాట్ మార్కెట్లతో పాటు రిటైల్ మార్కెట్లలో కూడా పసిడి ధరలు భారీగా ర్యాలీ అవుతున్నాయి. అయితే ఈ పరిస్థితులు ఇంకెన్నాళ్లు అసలు మళ్లీ బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులో రేట్లలోకి రావా అనే భయాలు సగటు భారతీయ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. 

ఈ క్రమంలో అమెరికాకు చెందిన సిటీ గ్రూప్ స్వల్పకాలంలో, అలాగే దీర్ఘకాలంలో పసిడి ధరలు ఎలా ఉంటాయనే అంచనాలను పంచుకుంది. ఈ ఏడాది చివరినాటికి లేదా 2026 మెుదట్లో బంగారం ధర ఔన్సుకు 3వేల డాలర్లకు తగ్గుతుందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా గోల్డ్ డిమాండ్ తగ్గటంతో పాటు, ఆర్థిక వృద్ధి మెరుగుపడటం దీనికి కారణంగా సిటీ గ్రూప్ వెల్లడించింది. అలాగే మూడవ త్రైమాసికం నాటికి పసిడి ధరలు ఔన్సుకు 3వేల 100 డాలర్ల నుంచి 3వేల 500 డాలర్ల మధ్యకు చేరుకుంటాయని పేర్కొంది. అలాగే రానున్న 12 నెలల కాలంలో పసిడి ధరలు ఔన్సుకు 2వేల 800 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని వెల్లడించింది. 

అయితే ఒకవేళ పరిస్థితులు ఊహించిన దానికి భిన్నంగా ఉన్నట్లయితే బుల్స్ జోరు కారణంగా మూడవ త్రైమాసికంలో పసిడి ధర ఔన్సుకు 3వేల 500 డాలర్ల మార్కును అధిగమించవచ్చని సిటీ గ్రూప్ అంచనా వేస్తోంది. అయితే ఈ పెరుగుదలకు అమెరికా ఆర్థిక వ్యవస్థ వల్ల వచ్చే ప్రమాదాలను తట్టుకునేందుకు సెంట్రల్ బ్యాంకులు, ప్రజలు చేసే పెట్టుబడుల ద్వారా నడిపించబడతాయని వెల్లడించింది. దీనికి తోడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ముదిరితే బంగారం హెడ్జింగ్ కోసం అంటే తమ సంపదను కాపాడుకునేందుకు రక్షణగా వినియోగించటం పెరుగుతుందని వెల్లడించింది. 

ప్రస్తుతానికి బంగారం ధరలు బులిష్ లేదా బేరిష్ పథంలో కొనసాగటానికి కేవలం 20 శాతం మాత్రమే అవకాశం ఉందని సిటి గ్రూప్ తన అంచనాల్లో స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం రానున్న కాలంలో బంగారం ధరలను డిసైడ్ చేసే అంశాల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు కూడా చాలా కీలకంగా మారుతుందని సిటీ గ్రూప్ అంచనాల ప్రకారం తెలుస్తోంది. 

వెండి సంగతి ఏంటి..?
గడచిన కొన్ని నెలలుగా వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చూస్తుండగానే ఏడాదిలో కేజీ వెండి ధర ఏకంగా రూ.40 వేల వరకు పెరిగింది. అయితే రానున్న ఏడాది కాలంలో వెండి ఔన్సు ధర 40 డాలర్ల మార్కుకు చేరుకోవచ్చని సిటీ గ్రూప్ పేర్కొంది. అయితే తగ్గుతున్న లభ్యత, భారీగా పెరిగిన డిమాండ్ వెండి ధరలను ప్రభావితం చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే బులిషన్ పరిస్థితుల్లో వెండి ఔన్సు ధర 46 డాలర్లకు చేరుకోవచ్చని వెల్లడించింది.