- క్రిప్టో ఎక్స్చేంజిలు యూపీఐ వాడుతున్నాయని తెలియదు.. ఎన్పీసీఐ ప్రకటన
- క్రిప్టో ఎక్స్చేంజిలకు పేమెంట్ సర్వీస్లను ఆపేసిన మొబిక్విక్
బిజినెస్ డెస్క్, వెలుగు: మొన్న కాయిన్బేస్, నేడు కాయిన్స్విచ్ కుబేర్, వజీర్ఎక్స్.. దేశంలోని టాప్ క్రిప్టో ఎక్స్చేంజిలు యూపీఐ ద్వారా మనీ డిపాజిట్ చేసుకునే ఫెసిలిటీని నిలిపేస్తున్నాయి. యూపీఐ ఫెసిలిటీని క్రిప్టో ఎక్స్చేంజిలు వాడుతున్నాయనే విషయం తెలియదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తాజాగా ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఆ తర్వాత నుంచి క్రిప్టో ఎక్స్చేంజిలు యూపీఐ ఆప్షన్ను టెంపరరీగా నిలిపివేయడం ప్రారంభించాయి. పేమెంట్ వాలెట్ కంపెనీ మొబిక్విక్ కూడా క్రిప్టో ఎక్స్చేంజిలకు సర్వీస్లను ఇవ్వడం ఆపేసింది. యూపీఐ ద్వారా క్రిప్టోకరెన్సీలను కొనుక్కోవచ్చని ఈ నెల 9 న కాయిన్బేస్ ప్రకటించింది. ఆ తర్వాత నుంచి ఎన్పీసీఐ క్రిప్టోఎక్స్చేంజిలపై దృష్టిపెట్టిందని చెప్పొచ్చు. ప్రస్తుతం దేశంలో క్రిప్టో కరెన్సీలపై ఎటువంటి బ్యాన్ లేదు. అలా అని వీటిని లీగలైజ్ చేయలేదు కూడా. కానీ, యూపీఐని క్రిప్టో ఎక్స్చేంజిలు వాడితే ఒక విధంగా క్రిప్టోలకు ప్రభుత్వ ఆమోద ముద్ర వచ్చినట్టవుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. దీంతో క్రిప్టోలు లీగలైజ్ అయ్యేంత వరకు యూపీఐని వాడుకోవడానికి ఎన్పీసీఐ అనుమతివ్వదని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని క్రిప్టో ఎక్స్చేంజిలు మాత్రమే ఐఎంపీఎస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్కు అవకాశం కలిపిస్తున్నాయి.
ఇప్పట్లో కష్టమే..
యూపీఐ ద్వారా డిపాజిట్ చేసుకునే అవకాశాన్ని కాయిన్స్విచ్ కుబేర్ నిలిపేసింది. వజీర్ఎక్స్ కూడా యూపీఐ ఆప్షన్ను తాత్కాలికంగా ఆపేసింది. ‘యూపీఐ అందుబాటులో లేదు. యూపీఐ డిపాజిట్లకు సంబంధించిన సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తామో తెలియదు’ అని వజీర్ఎక్స్ ట్విటర్లో ప్రకటించింది. కాయిన్బేస్ దేశంలో సర్వీస్లు స్టార్ట్ చేసిన మూడు రోజులకే యూపీఐ ఆప్షన్ను నిలిపేసింది. పేమెంట్ వాలెట్ కంపెనీ మొబిక్విక్తో కలిసి ఈ కంపెనీ యూపీఐ ఆప్షన్ను అందిస్తోంది. ‘క్రిప్టో ఎక్స్చేంజిలు యూపీఐని వాడడంపై ఎన్పీసీఐ ఇచ్చిన స్టేట్మెంట్ గురించి తెలుసు. ఎన్పీసీఐ, ఇతర లోకల్ రెగ్యులేటరీ సంస్థలతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నాం’ అని కాయిన్బేస్ ప్రకటించింది. కాగా, క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. క్రిప్టోలపై ఆర్బీఐ పెట్టిన బ్యాన్ను రెండేళ్ల కిందట సుప్రీం కోర్టు కొట్టేసింది. అయినప్పటికీ క్రిప్టో కరెన్సీలు మాక్రో ఎకానమీకి మంచిది కాదనే ఆలోచనలో ఆర్బీఐ ఉంది. ఎస్బీఐ లాంటి బ్యాంక్లూ క్రిప్టో ఎక్స్చేంజిల్లో యూపీఐ ద్వారా డిపాజిట్స్ చేసుకోవడాన్ని కిందటేడాది నిలిపేసిన విషయం తెలిసిందే. ‘క్రిప్టో ఎక్స్చేంజిలకు దూరంగా ఉండాలని పేమెంట్ సంస్థలకు అర్థమవుతోంది. క్రిప్టోలపై కొత్త ట్యాక్స్ రూల్స్ వచ్చిన తర్వాత కూడా కొన్ని పేమెంట్ సంస్థలు ఈ రూల్కు దూరంగా ఉంటున్నాయి. మా మెంబర్లందరూ క్రిప్టో ఎక్స్చేంజిలకు దూరంగా ఉంటున్నారు’ అని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ విశ్వాస్ పటేల్ అన్నారు.
ట్యాక్స్ వేశాక ట్రేడింగ్ తగ్గింది..
క్రిప్టో ప్రాఫిట్స్పై 30 శాతం ట్యాక్స్ రూల్ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి దేశంలో క్రిప్టోల ట్రేడింగ్ వాల్యూమ్స్ భారీగా పడ్డాయి. దేశంలోని పెద్ద క్రిప్టో ఎక్స్చేంజిల్లో ఏప్రిల్ 1 నుంచి ట్రేడింగ్ వాల్యూమ్స్ 55 శాతం (యావరేజ్ వాల్యూమ్స్ నుంచి) వరకు పడ్డాయని క్రిప్టో కరెన్సీ రీసెర్చ్ కంపెనీ క్రెబాకో ప్రకటించింది. క్రిప్టో ప్రాఫిట్స్పై 30 శాతం ట్యాక్స్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో పాటు క్రిప్టోలో వచ్చిన నష్టాన్ని ఇతర ఇన్కమ్ నుంచి ఆఫ్సెట్ చేయడానికి వీలు లేదని రూల్స్ తెచ్చింది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ తర్వాత నుంచి ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గుతున్నాయి. వజీర్ఎక్స్లో వాల్యూమ్స్ ఈ నెలలో ఇప్పటి వరకు 72 శాతం మేర పడ్డాయి. జెబ్పేలో 59 శాతం మేర, కాయిన్ డీసీఎక్స్లో 52 శాతం మేర తగ్గాయి. బిట్బీఎన్ఎస్లో 41 శాతం మేర వాల్యూమ్స్ తగ్గాయని క్రెబాకో పేర్కొంది.