హైదరాబాద్, వెలుగు: వానాకాలం అసెంబ్లీ సమావేశాలను 20 రోజులకు పైగా నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని రోజులు అసెంబ్లీ నడపమంటే అన్ని రోజులు నడుపుతామని ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఎజెండా పూర్తి కాగానే అర్థాంతరంగా వాయిదా వేస్తున్నారని విమర్శించారు. సోమవారం సీఎల్పీలో భట్టి మీడియాతో మాట్లాడారు. సీఎల్పీ బృందం కాళేశ్వరం వెళ్లకుండా అడ్డుకోవడానికి కారణమేంటో చెప్పాలని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. 43 రోజులుగా సమ్మె చేస్తున్న వీఆర్ ఏలు, టీచర్ల సమస్యలు, బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు వికటించి ఇబ్రహీంపట్నంలో నలుగురు మహిళలు మృతి చెందడం, ప్రభుత్వ హస్టల్స్, గురుకులాలు, పాఠశాలల్లో పురుగుల అన్నం తిని విద్యార్థులు ఆస్వస్థతకు గురవడంపై నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడుతామని చెప్పారు.
మునుగోడులో టీఆర్ఎస్కు 2వ స్థానం
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉన్నదని, అక్కడ గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని, టీఆర్ఎస్ రెండవ స్థానంలో ఉంటుందని చెప్పారు. సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజుగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం ఏడాది మొత్తం వజ్రోత్సవాలు నిర్వహించాలని భట్టి కోరారు. నిజాం రాజు నుంచి తెలంగాణకు స్వాతంత్ర్యం తీసుకొచ్చిన ఉద్యమంలో బీజేపీ, టీఆర్ ఎస్ పాత్ర ఏమున్నదని ప్రశ్నించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేసిన పోరాటం వల్ల తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. బీజేపీ దీనికి మతం రంగు రాష్ట్రంలో అల్లకల్లోలం లేపి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నదని విమర్శించారు.