
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని విజయవాడలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా తిరంగ యాత్రను నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన దీనికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితోపాటు అనేక మంది నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు పాల్గొన్నారు.
ఈ యాత్ర ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు కొనసాగింది. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో బీజేపీ దేశవ్యాప్తంగా 'తిరంగ యాత్ర' నునిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఏపీలో భారీగా యాత్రను నిర్వహించారు. సుమారు 5000 మంది పాల్గొన్న ఈ యాత్రలో జాతీయ జెండాలు చేతపట్టి, దేశభక్తి నినాదాలు ఇస్తూ భారత సైనికులకు మద్ధతు తెలిపారు.