బొగోటా: నైరుతి కొలంబియాలో హింసాకాండ కొనసాగుతోంది. శనివారం కాజిబియో మునిసిపాలిటీ పరిధిలోని పాన్- అమెరికన్ హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సుపై బాంబు దాడి జరిగింది. దీంతో బస్సులోని ప్రయాణికుల్లో 13 మంది మృతిచెందగా.. 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్, ఉన్నతాధికారులు అదే ప్రాంతంలో భద్రతపై సమీక్షా సమావేశంలో ఉండగానే ఈ ఘటన జరిగింది. కొలంబియా సైన్యాధిపతి దీనిని తీవ్రవాద చర్యగా అభివర్ణించారు. ఇవాన్ మోర్డిస్కో నెట్వర్క్, జైమ్ మార్టినెజ్ వర్గానికి చెందిన అసమ్మతివాదులే ఈ దాడికి కారణమని కొలంబియా సాయుధ దళాల కమాండర్ జనరల్ హ్యూగో లోపెజ్ ఆరోపించారు.
వీరు 2016లో ప్రభుత్వం కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ధిక్కరించి, డ్రగ్స్ స్మగ్లింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ దాడిని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా ఖండించారు.

