మిడతల పనిపట్టనీకి..ఫైరింజన్లు, జెట్టింగ్ మిషన్లు

మిడతల పనిపట్టనీకి..ఫైరింజన్లు, జెట్టింగ్ మిషన్లు

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దు జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేశామని, ఫైర్ ఇంజన్లను, జెట్టింగ్ మిషన్లను, పెస్టిసైడ్లను రెడీగా ఉంచామని చెప్పారు. మిడతలు రాష్ర్టం వైపు వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో గురువారం రివ్యూ చేశారు. దేశంలో మిడతల దండు ప్రవేశం, ప్రయాణం, ప్రభావం తదితర అంశాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో అవి ఎటువైపు వెళ్లే అవకాశం ఉందనే దానిపై ఆరా తీశారు.

గాలి మళ్లితే మనవైపు..

‘‘ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దులో మిడతల దండును చంపేందుకు గోండియా ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కోట్ల సంఖ్యలో మిడతలను చంపగలిగారు. అయినా కొన్ని మిడతలు మధ్యప్రదేశ్ మీదుగా పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలున్నట్లు అంచనాలున్నాయి. గాలి మరలి చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వైపు కూడా రావచ్చు. అందుకే మిడతల దండు రాష్ర్టంలోకి రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలి. సరిహద్దుల్లోనే పెద్ద ఎత్తున పురుగుల మందు పిచికారి చేసి మిడతలను చంపాలి’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఐదుగురు సభ్యులతో కమిటీ

మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవి రాష్ట్రంలో ప్రవేశించకుండా చేపట్టిన చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించినట్లు సీఎం తెలిపారు. ‘‘సీఐపీఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.సునీత, వ్యవసాయ వర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్.జె.రహమాన్, వరంగల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అక్బర్, రామగుండం సీపీ సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్ భారతితో కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు రామగుండంలోనే ఉంటుంది. హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట పరిస్థితిని గమనిస్తూ ఉంటుంది” అని వివరించారు. కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. వారు మిడతల దండు కదలికలను గమనిస్తూ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.

కెమికల్స్ సిద్ధంగా ఉంచుకోవాలి..

మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో 15 వేల లీటర్ల మాలాతియాన్, క్లోరోఫైరిపాస్, లామ్డా సైలోత్రిన్ కెమికల్స్​ను,12 ఫైర్ ఇంజన్లు, 12 జెట్టింగ్ మిషన్లు సిద్ధంగా పెట్టుకోవాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. సీఎస్, డీజీపీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ కార్యదర్శి, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి, అగ్రికల్చర్ వర్సిటీ వీసీ.. హైదరాబాద్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలన్నారు. ఆయా జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు. రివ్యూలో మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్  సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.