ఖాకీ చొక్కా వేసుకున్నానన్న అహంకారంతో ఒక సామాన్య కార్మికుడిపై ప్రతాపం చూపించాడు ఓ ఎస్సై. కరీంనగర్ నగరంలోని ఖాన్ పురా ఏరియాలో ఈ అమానుష ఘటన వెలుగుచూసింది. త్రీటౌన్ ఎస్సై ఒకరు షేవింగ్ కోసం స్థానిక సెలూన్ షాపుకు వెళ్లారు. అక్కడ పని చేసే రాము అనే వర్కర్, మర్యాదగా కూర్చో అన్నా అని పిలవడమే అతను చేసిన నేరమైపోయింది.
నన్నే అన్నా అంటావురా?" అంటూ ఊగిపోయిన ఎస్సై.. అధికార మదంతో రాముపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. గౌరవంగా పిలిచినందుకు ప్రతిఫలంగా పిడిగుద్దులు కురిపించాడు. సెలూన్ షాపులోని సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా సామాన్యులపై దాడికి దిగడంపై స్థానికులు మండిపడుతున్నారు.

