జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్టు

జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్టు

సంగారెడ్డి, వెలుగు: పథకాల పేరుతో మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌‌‌‌ను తెలంగాణ ప్రజలు నమ్మొద్దని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌‌‌‌కు జనం గుర్తుకు వస్తారని విమర్శించారు. ‘‘మొన్న దళితబంధు.. నేడు గిరిజన బంధు.. రేపు బీసీ బంధు.. ఎల్లుండి ఆకాశంలో చందమామ తెస్తా అంటరు. ఇలా అమలుకు నోచుకోని పథకాలతో ప్రజలను కేసీఆర్‌‌‌‌ మభ్యపెడుతున్నారు’ అని మండిపడ్డారు. ప్రజా ప్రస్థాన పాదయాత్రలో భాగంగా సోమవారం వైఎస్​ షర్మిల సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్​పేట, ఆరుట్ల, చిద్రుప్ప, హనుమాన్​నగర్, బ్యాతోల్ గ్రామాల్లో పాదయాత్ర చేశారు. చిద్రుప్పలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

‘‘దేశంలో ఏ నాయకుడూ అమలు చేయని పథకాలు ఇక్కడ వైఎస్ఆర్ అమలు చేసి చూపించారు. వాటిని ఇప్పుడు కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారు. పోశమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందన్న చందంగా రాష్ట్ర పరిస్థితి మారింది. బంగారు తెలంగాణ కేవలం కేసీఆర్ కుటుంబానికే చెందినట్లుగా తయారైంది” అని ఆరోపించారు. వైఎస్ఆర్ సంక్షేమం కోసమే తెలంగాణలో పార్టీ పెట్టి ప్రజల మధ్య తిరుగుతున్నానని తెలిపారు.

జగ్గారెడ్డి.. రోజుకో పార్టీ మారుతరు

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. మంత్రి కేటీఆర్ కోవర్టు అని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ విషయం గాంధీ భవన్‌‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. 30 ఏండ్లు వైఎస్ఆర్‌‌‌‌తో సేవ చేయించుకుని కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన వల్ల లబ్ధిపొందిన జగ్గారెడ్డి.. ఇప్పుడు వైఎస్ కుటుంబంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ రాజశేఖర​రెడ్డి గురించి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న జగ్గారెడ్డి.. రోజుకో పార్టీ మారుతూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్‌‌లో ఉన్న జగ్గారెడ్డి.. రేపు ఏపార్టీలో ఉంటారో ఆయనకే క్లారిటీ లేదని మండిపడ్డారు.