వీఆర్ఏలకుప్రభుత్వ పేస్కేల్‌ వచ్చే విధంగా చర్యలు తీసుకోండి.. సీఎం కేసీఆర్ ఆదేశం

వీఆర్ఏలకుప్రభుత్వ పేస్కేల్‌ వచ్చే విధంగా చర్యలు తీసుకోండి.. సీఎం కేసీఆర్ ఆదేశం

వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోపు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. ఈ విషయం పై కేబినేట్ లో నిర్ణయం తీసుకున్న అనంతరం వీఆర్ఏ జేఎసి ప్రతినిధులను తన ఛాంబర్ కు పిలిపించుకుని సీఎం వారితో చర్చించారు.  

బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసేదే పేద ప్రజల కోసమని, చిరుద్యోగులైన విఆర్ఏల సమస్యలను మానవత్వంతో వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నదని సీఎం పేర్కొన్నారు. సుమారు 20 వేల మంది ఉన్న వీఆర్ఏ లలో ముందుగా మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ ప్రకారం అర్హులై దరఖాస్తున్న చేసుకున్న వారి వారసుల వివరాలు, వారి విద్యార్హతలు సేకరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.

మిగతావారిని వారి అర్హతల ఆధారంగా మున్సిపల్, ఇరిగేషన్ (లష్కర్స్), రెవెన్యూ, జెడ్ పి, ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీలు, మిషన్ భగీరథ తదితర అవసరమైన శాఖల్లో స్కేల్ ఇస్తూ, తదుపరి ప్రమోషన్ వచ్చే విధంగా వారిని సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్ ను ఆదేశించారు. 

ఈ విషయంలో వీఆర్ఏ లు సమాచారం ఇవ్వడం సహా, అన్ని విషయాల్లో సమన్వయం చేయాలని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి సూచించారు. ముందుగా మొత్తం సమాచారాన్ని అధికారులకు అందజేయాలని, విఆర్ఏ జెఎసి ప్రతినిధులకు సూచించారు. విఆర్ఏలలో వారి విద్యార్హతలను బట్టి వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలను ఎంచుకునే అవకాశం ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు.