మే లోనూ ఉద్యోగుల జీతాలు కట్.. పేద‌ల‌కు నెల‌కు రూ.1500 క‌ట్

మే లోనూ ఉద్యోగుల జీతాలు కట్.. పేద‌ల‌కు నెల‌కు రూ.1500 క‌ట్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఇతర సీనియర్ అధికారులు ఈ స‌మీక్ష‌లో పాల్గొన్నారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నది. మే నెలలో కూడా పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆదేశించారు. అయితే లాక్‌డౌన్ సడలింపుల కారణంగా కార్మికులు, కూలీలకు మళ్లీ పని దొరకుతుంది కనుక ఈ నెల 1500 రూపాయలు నగదు ఇచ్చే కార్యక్రమం కొనసాగదని తేల్చి చెప్పారు.

అయితే రాష్ట్రానికి ప్రతీ నెలా 12వేల కోట్ల వరకు ఆదాయం రావాలని కానీ లాక్ డౌన్ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయిందని లాక్‌డౌన్ నిబంధనలలో కొన్ని సడలింపులు ఇచ్చినా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరగలేదని రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదన్నారు. రాష్ట్రం ఏడాదికి రూ.37,400 కోట్లను అప్పులకు కిస్తీలుగా చెల్లించాలని అప్పులను రీ షెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరినా స్పందించలేదని దీంతో కిస్తీలు తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అయితే అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలని, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోతలు ఉంటాయని తీర్మానించారు.