జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ​ఏకాకి

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ​ఏకాకి
  • దూరంపెడ్తున్న ప్రధాన ప్రాంతీయ పార్టీల నేతలు
  • ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు బ్రేక్​

హైదరాబాద్, వెలుగు: జాతీయ రాజకీయాల్లో బీజేపీ యేతర, కాంగ్రెస్​ యేతర ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసి చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్​ ఆశలకు బ్రేకులు పడ్డాయి. తనతో కలిసి వస్తాయనుకున్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు దూరం జరుగుతుండటంతో ఆయన ఏకాకిగా మారిపోయారు. డీఎంకే, టీఎంసీ,  జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీ,  జేఎంఎం, ఆమ్​ ఆద్మీ వంటి పార్టీలతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు కలిసికట్టుగా సాగుతామని సంకేతాలు ఇచ్చారు. కర్నాటక ఎన్నికల్లో తన దోస్త్​ జేడీఎస్​ చీఫ్​ కుమారస్వామి కింగ్​మేకర్ ​అవుతారని కేసీఆర్​ భావించగా.. తీరా ఉన్న సీట్లలో సగం సీట్లను జేడీఎస్​ కోల్పోయి చతికిలపడింది. అక్కడ కాంగ్రెస్​  విజయం సాధించడంతో.. ప్రధాన ప్రాంతీయ పార్టీల నేతలు హస్తం పార్టీతో కలిసి నడిచేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. దీంతో.. ప్రత్యామ్నాయ వేదిక కోసం గాలి మోటర్​ ఎక్కి రాష్ట్రాలను చుట్టివచ్చిన బీఆర్​ఎస్​ బాస్​కు సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే ఊహించని షాక్​ తగిలినట్లయింది. కేసీఆర్​తో గతంలో భేటీ అయిన చిన్నచిన్న పార్టీలు కూడా ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేవు. 

వేడుకలకు వచ్చినోళ్లు కూడా అటే!

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే పేరుతోనే ఆ మధ్య టీఆర్ఎస్​పేరును బీఆర్ఎస్​గా మార్చారు. ఈ కార్యక్రమానికి జేడీఎస్​చీఫ్​ కుమారస్వామి, తమిళనాడుకు చెందిన ఎంపీ, విడుతలై చిరుతైగల్​ కచ్చి పార్టీ చీఫ్​ తిరుమావళన్ సహా పలువురు రైతు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో ఇప్పుడు ఆ కొందరు రైతు సంఘాల ప్రతినిధులు మాత్రమే కేసీఆర్​వెంట ఉన్నారు.  టీఆర్​ఎస్​ను బీఆర్​ఎస్​గా మార్చిన తర్వాత ఖమ్మంలో మొదటి బహిరంగ సభను కేసీఆర్​ నిర్వహించారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్​ సీఎంలు పినరయి విజయన్​, కేజ్రీవాల్, భగవంత్​సింగ్​మాన్, ఎస్పీ చీఫ్​అఖిలేశ్​ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా సహా పలువురు నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా ఇప్పుడు కేసీఆర్​తో, ఆయన పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. 

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ​ఏకాకి!

గతంలో కేసీఆర్​కలిసిన లీడర్లలో తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్​సీఎం నితీశ్​ కుమార్, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత  తేజస్వీ యాదవ్, జార్ఖండ్​సీఎం హేమంత్​ సోరెన్, ఎన్సీపీ చీఫ్ శరద్​పవార్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇటీవల బెంగళూరులో సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​తో జట్టుగా ముందుకు వెళ్తామనే ఇండికేషన్​ఇచ్చారు. మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్​ ఠాక్రే ఇప్పటికే కాంగ్రెస్​తో కలిసి పనిచేస్తున్నారు. ఇన్నాళ్లూ తృతీయ ప్రత్యామ్నాయం అంటూ వచ్చిన బెంగాల్​ సీఎం, టీఎంసీ చీఫ్​ మమతా బెనర్జీ కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత లైన్​మార్చుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీలకే కాంగ్రెస్​ మద్దతివ్వాలని ఆమె సూచించారు. నేషనల్​కాన్ఫరెన్స్​ఇప్పటికే కాంగ్రెస్​తో కలిసి ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్​కు ప్రత్యామ్నాయ శక్తిగా ఆప్​ను నిలబెట్టాలని ప్రయత్నించిన కేజ్రీవాల్ కూడా లైన్​ మార్చుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ఢిల్లీ సీఎం, ఆప్​చీఫ్​కేజ్రీవాల్​జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఐక్యం చేసే క్రమంలో బీహార్​సీఎం,  జేడీయూ చీఫ్​ నితీశ్​కుమార్​తో   భేటీ అయ్యారు. కాంగ్రెస్​తో కలిసి పనిచేస్తామని నితీశ్​ ప్రకటించారు.

దూరం దూరం

మహారాష్ట్రలో పార్టీ విస్తరణ పేరుతో ఎన్సీపీ నేతలను చేర్చుకుంటున్న కేసీఆర్​పై ఆ పార్టీ చీఫ్​ శరద్​ పవార్​గుర్రుగా ఉన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జగన్, కేసీఆర్​ దోస్తీ బాగానే ఉన్న క్రమేణా ఇద్దరి మధ్య గ్యాప్​ పెరిగింది.  గతంలో కేసీఆర్​తో సన్నిహితంగా మెలిగిన స్టాలిన్, హేమంత్ ​సోరెన్, తేజస్వీ యాదవ్​ ఇప్పుడు దూరం పెడుతున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతోనే బీఆర్ఎస్​ జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రకటించినప్పటికీ తీరా ఎన్నికలు టైమ్​ వచ్చేసరికి పోటీలోంచి తప్పుకున్నారు.  అక్కడ కుమారస్వామి ఆధ్వర్యంలోని జేడీఎస్​కు అన్నిరకాలుగా అండగా నిలిచినా ఫలితం లేకుండా పోయింది. 2018 ఎన్నికల్లో జేడీఎస్​కు 37 సీట్లు రాగా.. తాజా ఎన్నికల్లో 18 సీట్లన కోల్పోయి 19 సీట్లకు పరిమితమైంది. ఐదు శాతానికి పైగా ఓట్లు కోల్పోయింది. కన్నడ ఓటరు తీర్పు తర్వాత కాంగ్రెస్​ విషయంలో ప్రాంతీయ పార్టీల ఆలోచన మారింది. దీంతో జాతీయ రాజకీయాల్లో  కేసీఆర్​ ఒంటరయ్యారు. ఆయన చెప్తున్న కాంగ్రెస్​యేతర, బీజేపీ యేతర ప్రత్యామ్నాయం సాధ్యం కాదనే విషయం కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత సీన్​ను చూస్తే అర్థమవుతున్నదని బీఆర్​ఎస్​ నేతలు కూడా అంటున్నారు. 

మధ్యలో రెండేండ్లు గప్​చుప్​​

జాతీయ రాజకీయాల కోసం ఐదేండ్ల నుంచి కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారు.  2017 ఏడాది చివరన, 2018 ప్రారంభంలో అనేక రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలను, పలు పార్టీల అధినేతలను కలిశారు. జాతీయ స్థాయిలో కలిసి పనిచేద్దామని ఆహ్వానించారు.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నేషనల్​ పాలిటిక్స్​పై ఇంకింత దృష్టి పెట్టారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో ‘‘సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో మనం చెప్పినోళ్లదే సర్కారు’’ అనే నినాదంతో ముందుకు వెళ్లినా.. కేవలం తొమ్మిది లోక్​సభ స్థానాలతోనే సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత రెండేండ్ల పాటు కామ్​గా ఉన్న కేసీఆర్​.. కరోనా సెకండ్​ వేవ్ ​తర్వాత కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడం మొదలుపెట్టారు. కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఢిల్లీ సహా అనేక రాష్ట్రాలకు వెళ్లి.. జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేద్దామని అక్కడి  పార్టీల నేతలను కోరారు. వారెవరూ కేసీఆర్​తో కలిసి జాతీయ రాజకీయాల్లో పనిచేస్తామన్న బలమైన హామీ ఇవ్వలేదు.