
- దూరంపెడ్తున్న ప్రధాన ప్రాంతీయ పార్టీల నేతలు
- ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు బ్రేక్
హైదరాబాద్, వెలుగు: జాతీయ రాజకీయాల్లో బీజేపీ యేతర, కాంగ్రెస్ యేతర ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసి చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఆశలకు బ్రేకులు పడ్డాయి. తనతో కలిసి వస్తాయనుకున్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు దూరం జరుగుతుండటంతో ఆయన ఏకాకిగా మారిపోయారు. డీఎంకే, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీ, జేఎంఎం, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు కలిసికట్టుగా సాగుతామని సంకేతాలు ఇచ్చారు. కర్నాటక ఎన్నికల్లో తన దోస్త్ జేడీఎస్ చీఫ్ కుమారస్వామి కింగ్మేకర్ అవుతారని కేసీఆర్ భావించగా.. తీరా ఉన్న సీట్లలో సగం సీట్లను జేడీఎస్ కోల్పోయి చతికిలపడింది. అక్కడ కాంగ్రెస్ విజయం సాధించడంతో.. ప్రధాన ప్రాంతీయ పార్టీల నేతలు హస్తం పార్టీతో కలిసి నడిచేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. దీంతో.. ప్రత్యామ్నాయ వేదిక కోసం గాలి మోటర్ ఎక్కి రాష్ట్రాలను చుట్టివచ్చిన బీఆర్ఎస్ బాస్కు సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే ఊహించని షాక్ తగిలినట్లయింది. కేసీఆర్తో గతంలో భేటీ అయిన చిన్నచిన్న పార్టీలు కూడా ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేవు.
వేడుకలకు వచ్చినోళ్లు కూడా అటే!
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే పేరుతోనే ఆ మధ్య టీఆర్ఎస్పేరును బీఆర్ఎస్గా మార్చారు. ఈ కార్యక్రమానికి జేడీఎస్చీఫ్ కుమారస్వామి, తమిళనాడుకు చెందిన ఎంపీ, విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ చీఫ్ తిరుమావళన్ సహా పలువురు రైతు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో ఇప్పుడు ఆ కొందరు రైతు సంఘాల ప్రతినిధులు మాత్రమే కేసీఆర్వెంట ఉన్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఖమ్మంలో మొదటి బహిరంగ సభను కేసీఆర్ నిర్వహించారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు పినరయి విజయన్, కేజ్రీవాల్, భగవంత్సింగ్మాన్, ఎస్పీ చీఫ్అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా సహా పలువురు నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా ఇప్పుడు కేసీఆర్తో, ఆయన పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు.
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఏకాకి!
గతంలో కేసీఆర్కలిసిన లీడర్లలో తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, జార్ఖండ్సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీపీ చీఫ్ శరద్పవార్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇటీవల బెంగళూరులో సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్తో జట్టుగా ముందుకు వెళ్తామనే ఇండికేషన్ఇచ్చారు. మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నారు. ఇన్నాళ్లూ తృతీయ ప్రత్యామ్నాయం అంటూ వచ్చిన బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత లైన్మార్చుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీలకే కాంగ్రెస్ మద్దతివ్వాలని ఆమె సూచించారు. నేషనల్కాన్ఫరెన్స్ఇప్పటికే కాంగ్రెస్తో కలిసి ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఆప్ను నిలబెట్టాలని ప్రయత్నించిన కేజ్రీవాల్ కూడా లైన్ మార్చుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ఢిల్లీ సీఎం, ఆప్చీఫ్కేజ్రీవాల్జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఐక్యం చేసే క్రమంలో బీహార్సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్కుమార్తో భేటీ అయ్యారు. కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామని నితీశ్ ప్రకటించారు.
దూరం దూరం
మహారాష్ట్రలో పార్టీ విస్తరణ పేరుతో ఎన్సీపీ నేతలను చేర్చుకుంటున్న కేసీఆర్పై ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్గుర్రుగా ఉన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జగన్, కేసీఆర్ దోస్తీ బాగానే ఉన్న క్రమేణా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. గతంలో కేసీఆర్తో సన్నిహితంగా మెలిగిన స్టాలిన్, హేమంత్ సోరెన్, తేజస్వీ యాదవ్ ఇప్పుడు దూరం పెడుతున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతోనే బీఆర్ఎస్ జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రకటించినప్పటికీ తీరా ఎన్నికలు టైమ్ వచ్చేసరికి పోటీలోంచి తప్పుకున్నారు. అక్కడ కుమారస్వామి ఆధ్వర్యంలోని జేడీఎస్కు అన్నిరకాలుగా అండగా నిలిచినా ఫలితం లేకుండా పోయింది. 2018 ఎన్నికల్లో జేడీఎస్కు 37 సీట్లు రాగా.. తాజా ఎన్నికల్లో 18 సీట్లన కోల్పోయి 19 సీట్లకు పరిమితమైంది. ఐదు శాతానికి పైగా ఓట్లు కోల్పోయింది. కన్నడ ఓటరు తీర్పు తర్వాత కాంగ్రెస్ విషయంలో ప్రాంతీయ పార్టీల ఆలోచన మారింది. దీంతో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఒంటరయ్యారు. ఆయన చెప్తున్న కాంగ్రెస్యేతర, బీజేపీ యేతర ప్రత్యామ్నాయం సాధ్యం కాదనే విషయం కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ను చూస్తే అర్థమవుతున్నదని బీఆర్ఎస్ నేతలు కూడా అంటున్నారు.
మధ్యలో రెండేండ్లు గప్చుప్
జాతీయ రాజకీయాల కోసం ఐదేండ్ల నుంచి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. 2017 ఏడాది చివరన, 2018 ప్రారంభంలో అనేక రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలను, పలు పార్టీల అధినేతలను కలిశారు. జాతీయ స్థాయిలో కలిసి పనిచేద్దామని ఆహ్వానించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నేషనల్ పాలిటిక్స్పై ఇంకింత దృష్టి పెట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ‘‘సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో మనం చెప్పినోళ్లదే సర్కారు’’ అనే నినాదంతో ముందుకు వెళ్లినా.. కేవలం తొమ్మిది లోక్సభ స్థానాలతోనే సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత రెండేండ్ల పాటు కామ్గా ఉన్న కేసీఆర్.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడం మొదలుపెట్టారు. కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఢిల్లీ సహా అనేక రాష్ట్రాలకు వెళ్లి.. జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేద్దామని అక్కడి పార్టీల నేతలను కోరారు. వారెవరూ కేసీఆర్తో కలిసి జాతీయ రాజకీయాల్లో పనిచేస్తామన్న బలమైన హామీ ఇవ్వలేదు.