టీఆర్ఎస్ ఎంపీలతో రేపు  సీఎం కేసీఆర్ భేటీ

 టీఆర్ఎస్ ఎంపీలతో రేపు  సీఎం కేసీఆర్ భేటీ

ఈ నెల 18 నుంచి ప్రారంభ కానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలోఎంపీలతో రేపు మధ్యాహ్నం  ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్  సమావేశం కానున్నారు.  ఉభయ సభల్లో  అనుసరించాల్సిన విధివిధానాల పై దిశానిర్దేశం చేసేందుకు..  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల పై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్ సూచించనున్నారు.  పార్లమెంటు వేదికగా పోరాటం చేయాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

రైతు వ్యతిరేక విధానాలపై పార్లమెంట్ లో పోరాడండి

అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించకుండా ఆర్థింకగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయాలని కేంద్రం కుటిల ప్రయత్నాలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అద్దం పడుతూ ఉభయ సభల్లో బీజేపీ నిలదీయాలని ఎంపీలకు కేసీఆర్ సూచించనున్నారు.  సాగునీరు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక మార్పులతో అనతికాలంలోనే  అంచనాలను మించి.. ధాన్యం ఉత్పత్తిలో   తెలంగాణ దేశంలోనే ముందంజలో నిలిచిందన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా, రైతులను మిల్లర్లను ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల పై పోరాడాలని ఎంపీలకు సీఎం పిలుపునివ్వనున్నారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కుట్రలు 

గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న తెలంగాణ విషయంలో కేంద్రం పొంతనలేని ద్వంద్వం వైఖరిని, దుర్మార్గ విధానాన్ని నిలదీయాలని సిఎం నిర్ణయించారు.  తెలంగాణ లో గ్రామీణ ఉపాధి హామీ పథకం గొప్పగా అమలు జరుగుతున్న తీరు గురించి, రాష్ట్రంలో జరుగుతున్న సోషల్ ఆడిట్ గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రశంసించింది..  అవార్డులు ఇచ్చింది. కానీ  కేంద్ర ప్రభుత్వం  మాట మార్చి దానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేయాలనే కేంద్రం కుట్రలు, రూపాయి పతనం పై ఉభయ సభల సాక్షిగా నిలదీయాలని ఎంపీలకు సూచించనున్నారు.

ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా దుర్మార్గ విధానాలు

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక ..ఆధిపత్యధోరణి వల్ల దేశంలో రోజు రోజుకూ ప్రజాస్వామిక విలువలు దిగజారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. రాజ్యాంగం పొందుపరిచిన ఫెడరల్ స్ఫూర్తికి, సెక్యులర్ జీవన విధానానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర  ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పార్లమెంటు వేదికగా  దేశ ప్రజల ఆకాంక్షలను చాటేలా గొంతు విప్పాలని  ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంట్ లో నిలదీయాలి

కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటంలో భాగంగా కలిసివచ్చే ఇతర రాష్ట్రాల విపక్ష ఎంపీలను కూడా కలుపుకొని, కేంద్రం మెడలు వంచి ప్రజాస్వామిక విలువలు కాపాడాల్సి వున్నదిని సీఎం అభిప్రాయపడ్డారు.  పార్లమెంటు ఉభయ సభల్లో  కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలను నిలదీస్తూ  గళం విప్పాలని ముఖ్యమంత్రి  రేపటి సమావేశంలో ఎంపీలకు పిలుపునివ్వనున్నారు.