కోరుట్ల, వెలుగు : సుమారు 42 ఏండ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ బుధవారం సొంతూరు జగిత్యాల జిల్లా కోరుట్లకు వచ్చారు. దేవ్జీ రాకతో కుటుంబ సభ్యులు, బంధువులు, చిన్ననాటి మిత్రులు భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు హారతి ఇచ్చి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల ఫొటోల వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమంలోకి వెళ్లాక తిరిగి సొంతింటికి వస్తానని కలలో కూడా అనుకోలేదన్నారు. తాను వ్యక్తిగత జీవితానికి పరిమితం కాకుండా ప్రజాజీవితంలో ఉంటానని చెప్పారు. సామాజిక, ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం గతంలో పోరాడామని, ఇప్పుడ కూడా అదే లక్ష్యంతో ప్రజా క్షేత్రంలో పని చేస్తానని స్పష్టం చేశారు. కుటుంబసభ్యులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేవ్జీని చూసేందుకు గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
