న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్లో ఇండియా వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఆసియా/ ఓసియానియా గ్రూప్–1లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో ఇండియా 3–0తో న్యూజిలాండ్కు చెక్ పెట్టింది. తొలి సింగిల్స్లో వైష్ణవి అడ్కర్ 6–2, 6–4తో ఐషి దాస్పై గెలిచింది.
గంటన్నర పాటు సాగిన మ్యాచ్లో వైష్ణవి అనవసర తప్పిదాలను తగ్గించుకుంటూ నియంత్రణతో కూడిన షాట్లు ఆడింది. తొలిసెట్లో ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసి 2–0తో ముందంజ వేసిన ఆమె ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. రెండో సింగిల్స్లో సహజ యమలపల్లి 6–1, 6–3తో వాలెంటినా ఇవనోవ్ను ఓడించింది. గంటా 25 నిమిషాల మ్యాచ్లో సహజ దూకుడుగా ఆడింది.
డబుల్స్లో రుతుజా భోసలే–అంకితా రైనా 6–4, 6–2తో మోనిక్ బారీ–ఎరిన్ రౌట్లిఫ్పై గెలిచారు. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఇండియా 2–1తో థాయ్లాండ్పై నెగ్గింది. తొలి రెండు సింగిల్స్లో సహజ, వైష్ణవి ఓటమిపాలైనా.. డబుల్స్లో రుతుజా–అంకిత 6–3, 6–4తో తసపోర్న్ నక్లో–పింగటార్న్ ప్లిపుచ్పై గెలిచి ఇండియాకు విజయాన్ని అందించారు.
