గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో ఇంట్రెస్టింగ్ సీన్.. హగ్ చేసుకున్న CM రేవంత్, అల్లు అర్జున్

గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో ఇంట్రెస్టింగ్ సీన్.. హగ్ చేసుకున్న CM రేవంత్, అల్లు అర్జున్

హైదరాబాద్: గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్స వేడుకలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి, స్టార్ హీరో అల్లు అర్జున్ ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఈ సీన్ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‎గా నిలిచింది. కాగా, హైదరాబాద్‎లోని హైటెక్స్‏ వేదికగా జరుగుతోన్న గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్‎డీసీ ఛైర్మన్ దిల్ రాజ్, ఎఫ్‎డీసీ ఎండీ హరీశ్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. 

ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. హీరోలు అల్లు అర్జున్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, నిర్మాతలు దిల్ రాజ్, అల్లు అరవింద్, సీనియర్ హీరోయిన్స్ సుహాసినీ, జయసుధ, హేమా మాలిని, సింగర్ సునీత, దర్శకులు రాజమౌళి, సుకుమార్, మురళీ మోహన్, కీరవాణి, సింగర్ రేవంత్, ఎస్‎జే సూర్య తదితరులు హాజరయ్యారు. ఈ వేడుక ప్రారంభమైన కాసేపటికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 

అనంతరం అందరికి కరచాలనం చేసుకుంటూ వెళ్లారు సీఎం  రేవంత్. ఈ సందర్భంగానే హీరో బాలకృష్ణ, అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నారు. హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా.. బన్నీ జైలుకు కూడా వెళ్లారు. దీంతో అల్లు అర్జున్‎ను సీఎం రేవంత్ రెడ్డి కావాలనే టార్గెట్ చేశారని ఆరోపణలు వినిపించాయి. కానీ, ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డుకు ఎంపికయ్యాడు. 

దీంతో సీఎం రేవంత్ రెడ్డి బన్నీని టార్గెట్ చేయలేదని.. తొక్కిసలాట ఘటనలో చట్టం తన పని తాను చేసుకోపోయిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‎ని టార్గెట్ చేసి ఉంటే గద్దర్ అవార్డుకు ఎలా ఎంపిక చేస్తారు..? ఎందుకు అల్లు అర్జున్‎తో ఇంత అప్యాయంగా ఉంటారు..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ అప్యాయంగా హగ్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న పుకార్లకు తెరపడింది. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014 నుంచి 2024 వరకు మొత్తం 30 సినిమాలకు ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వగా 2014 నుంచి ఆ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ  10 ఏండ్ల తర్వాత ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందిస్తోంది. 2014 నుంచి 2024 వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సినిమాలకు, నటులు, దర్శకులు, టెక్నిషియన్లకు ప్రభుత్వం అవార్డులను ప్రదానం చేసింది.